హైదరాబాద్: సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని లైంగికంగా వేధించిన కేసులో అరెస్టయిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి హైదరాబాద్లోని ఉప్పరపల్లి కోర్టు ఆగస్టు 11 వరకు రిమాండ్ విధించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు.
ఈ వ్యవహారంలో సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA) ఏర్పాటు చేసిన అంతర్గత విచారణ కమిటీ సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలను పరిశీలించి ఆరోపణల్లో నిజముందని తేల్చడంతో పోలీస్ అకాడమీ ఉదయ్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేసింది. అనంతరం ఉదయ్ మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించగా, నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ (షీ టీమ్స్) పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఈ నెల 18న కర్ణాటకకు చెందిన 30 ఏళ్ల వివాహిత, ట్రైనీ ఐపీఎస్ అధికారిణి తనపై ఉదయ్ కృష్ణారెడ్డి తీవ్ర లైంగిక వేధింపులు, దాడికి పాల్పడ్డాడని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణను షీ టీమ్స్కు బదిలీ చేశారు. అరెస్టుకు ముందు ఉదయ్ మానసిక ఒత్తిడితో అధిక మొత్తంలో మద్యం సేవించి ఆస్పత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే.