ED Notice to Midhun Reddy : మిదున్ రెడ్డి కి బిగుసుకుంటున్న ఉచ్చు..లిక్కర్ కేసులో నోటీసులు
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా వైసీపీ కీలక నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలో సిట్ (SIT) విచారణ ఎదుర్కొన్న సాయిరెడ్డి, తాను ఈ కేసులో కేవలం ‘విజిల్ బ్లోయర్’ (అక్రమాలను బయటపెట్టిన వ్యక్తి) మాత్రమేనని, అసలు సూత్రధారి రాజ్ కేసీ రెడ్డి అని ఆరోపణలు చేయడం గమనార్హం. మద్యం అమ్మకాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన వాదిస్తున్నప్పటికీ, ఆర్థిక లావాదేవీల కోణంలో ఈడీ ఆయనను ప్రశ్నించనుంది.
ED Notice to Midhun Reddy : మిదున్ రెడ్డి కి బిగుసుకుంటున్న ఉచ్చు..లిక్కర్ కేసులో నోటీసులు
విజయసాయిరెడ్డితో పాటు మరో కీలక నేత, ఎంపీ మిథున్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు అందడం వైసీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఇదే కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్పై వచ్చిన మిథున్ రెడ్డిని, ఈ నెల 23న విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన భారీ ఆదాయాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఇతర మార్గాలకు మళ్లించారనే (Money Laundering) ప్రధాన ఆరోపణలపై ఈ దర్యాప్తు సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో 48 మందిపై కేసులు నమోదు కాగా, 16 మంది అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు నేరుగా పార్టీ ముఖ్య నేతలపై ఈడీ గురిపెట్టడం, రానున్న రోజుల్లో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో అన్న ఉత్కంఠను రేపుతోంది.
ఇదే సమయంలో విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేస్తున్న వ్యాఖ్యలు సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారాయి. వెనిజులాలో జరిగిన రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన ట్వీట్, పరోక్షంగా జగన్ కోటరీని ఉద్దేశించినదేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సాయిరెడ్డి, అక్కడి పరిణామాలను గమనించిన తర్వాతే ఈ విధమైన పోస్టులు పెడుతున్నారనే చర్చ సాగుతోంది. ఒకవైపు జగన్ జిల్లాల యాత్రలకు సిద్ధమవుతుంటే, మరోవైపు పార్టీ నంబర్ 2, నంబర్ 3 స్థానాల్లో ఉన్న నేతలకు నోటీసులు రావడం వైసీపీని డిఫెన్స్లో పడేసింది. 2029 ఎన్నికలే లక్ష్యంగా కూటమి పార్టీలు వ్యూహాలు రచిస్తున్న వేళ, ఈ దర్యాప్తు సంస్థల విచారణ ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీసేలా కనిపిస్తోంది.
