Punarvika : మానవత్వం ఇంకా బతికేఉంది.. పునర్విక కోసం విజయవంతమైన నిధుల సేకరణ .. ఇకపై విరాళాలు పంపవద్దని కోరిన తండ్రి ..!
Punarvika : అరుదైన వ్యాధితో పోరాడుతున్న కర్నూలు జిల్లాకు చెందిన 11 నెలల చిన్నారి పునర్వికకు సోషల్ మీడియా వేదికగా జరిగిన భారీ విరాళాల సేకరణ విజయవంతమైంది. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA) టైప్-1 అనే తీవ్రమైన జన్యు వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారికి అవసరమైన ఖరీదైన ఇంజెక్షన్ కోసం ప్రజలు ఏకమై ముందుకు వచ్చారు. సుమారు ₹16 కోట్ల విలువైన ఈ చికిత్స కోసం చేపట్టిన క్రౌడ్ ఫండింగ్ మహాయజ్ఞంలా సాగి చివరకు పూర్తి నిధులు సమకూరాయి. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సురేశ్ కుమార్, పుష్పావతి దంపతుల కుమార్తె పునర్విక అనారోగ్య వార్త తెలిసిన వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు స్పందించారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా చిన్నారి పరిస్థితిని వివరిస్తూ విస్తృత ప్రచారం చేపట్టారు. అనేక కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు తమ వంతు సహాయం అందించడమే కాకుండా, విరాళాల కోసం పిలుపునిచ్చారు…
Punarvika : మానవత్వం ఇంకా బతికేఉంది.. పునర్విక కోసం విజయవంతమైన నిధుల సేకరణ .. ఇకపై విరాళాలు పంపవద్దని కోరిన తండ్రి ..!
ప్రత్యేకంగా ‘ట్రావెల్ విత్ జగదీష్’ అనే ఇన్ఫ్లుయెన్సర్ ఒక్కరే రూ.కోటిన్నరకు పైగా సేకరించడం విశేషం. ప్రజల నుంచి వచ్చిన విరాళాలు రూ.8.53 కోట్లకు పైగా చేరగా, ప్రభుత్వ సహాయం కలవడంతో అవసరమైన మొత్తం పూర్తైంది. నిధులు పూర్తిగా సమకూరిన నేపథ్యంలో ఇకపై ఎవరూ డబ్బులు పంపవద్దని సురేశ్ కుమార్ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. తమ కుమార్తెకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, త్వరలో ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. అవసరమైన దానికంటే ఎక్కువగా వచ్చిన నిధులను ఇతర అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారుల చికిత్సకు వినియోగిస్తామని ప్రకటించడం అందరినీ కదిలించింది. ఒక చిన్నారి ప్రాణం కోసం ప్రజలు ఏకమై చూపిన మానవత్వం సమాజానికి ఆదర్శంగా నిలిచింది.
