Karthika Deepam 2 Today Episode August 31st : కార్తీక దీపం 2 : సుమిత్రకు ప్రాణాపాయం.. కార్తీక్, దీపలను ఇంటి నుంచి పంపించిన శివన్నారాయణ..!
Karthika Deepam 2 Today Episode August 31st : కార్తీక దీపం 2 ఆగస్ట్ 31 ఎపిసోడ్ మరింత ఉత్కంఠగా సాగింది. జ్యోత్స్న పెళ్లి ఆగిపోవడం, సుమిత్ర పరిస్థితి విషమించడం, కార్తీక్, దీపలను ఇంటి నుంచి వెళ్లిపోవాలని శివన్నారాయణ ఆదేశించడం వంటి పరిణామాలు కథను కీలక మలుపు తిప్పాయి. మరోవైపు తన భర్త కృష్ణమూర్తి మరణానికి సుమిత్రే కారణమని భావిస్తున్న మాలిని.. తన కొడుకు సూరజ్ను కూడా ప్రతీకార మార్గంలో నడిపించినట్లు వెల్లడైంది. ఇదంతా తెలుసుకున్న సూరజ్ మాత్రం తన తల్లి చెప్పిన మాటలనే నిజమని నమ్ముతున్నాడు. అయితే జ్యోత్స్న విషయంలో మాత్రం అతడి మనసులో బాధ మొదలైంది. ముందుగా గత ఎపిసోడ్లో ఏం జరిగిందో చూస్తే.. తన భర్త చావుకు అందరూ కారణమేనంటూ మాలిని శివన్నారాయణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన తల్లికి జరిగిన అన్యాయానికి తన కొడుకు ప్రతీకారం తీర్చుకున్నాడని చెప్పింది. తన ఇంటి ఆడపడుచును ప్రేమ పేరుతో మోసం చేసి కుటుంబ పరువు తీసి ఇంటి నుంచి తీసుకెళ్లావని, నిన్ను నమ్మిన స్నేహితుడికి వెన్నుపోటు పొడిచావని శివన్నారాయణను నిలదీసింది. అంతేకాదు.. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని కుటుంబ పరువు సగం తీసుకెళ్లడమే కాకుండా, తన అన్నయ్యపై మర్డర్ కేసు పెట్టావంటూ సుమిత్రపై కూడా మాలిని మండిపడింది. తన అన్నయ్య చావుకు సుమిత్రే కారణమని ఆరోపించింది. ఈ మాటలతో కార్తీక్ తీవ్రంగా స్పందించి సూరజ్ కాలర్ పట్టుకుని.. ఇంత మోసం చేస్తావా? అంటూ ప్రశ్నించాడు. తాను కార్తీక్, దీపల వల్లే వారి కంపెనీలోకి, శివన్నారాయణ ఇంట్లోకి, జ్యోత్స్న జీవితంలోకి వచ్చానని సూరజ్ వారినే ఇరికించాడు. వాళ్లు లేకపోతే తాను పెళ్లి పీటల వరకు వచ్చేవాడినే కాదని చెప్పాడు. తన మనవరాలి పెళ్లి పీటల మీదే ఆగిపోయిందంటూ కన్నీళ్లు పెట్టుకున్న మాలిని.. సూరజ్ను వెంట తీసుకుని వెళ్లిపోయింది. కూతురి పెళ్లి పీటలపైనే ఆగిపోవడంతో సుమిత్ర స్పృహతప్పి పడిపోయింది. ఆమెను కార్తీక్, దీపలు పట్టుకోబోతుండగా శివన్నారాయణ తీవ్రంగా స్పందించాడు. మరోవైపు జ్యోత్స్నతో కలిసి ఇంటికి రాకుండా కేవలం సూరజ్, మాలిని మాత్రమే రావడంతో దక్షిణామూర్తి కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. భర్త ఫొటో దగ్గర దీపం వెలిగించిన మాలిని.. గతంలో తానే దశరథను లారీతో చంపేందుకు ప్లాన్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంది. అక్కడితో గత ఎపిసోడ్లో కీలక సన్నివేశాలు ముగిశాయి.
Karthika Deepam 2 Today Episode August 31st : కార్తీక దీపం 2 : సుమిత్రకు ప్రాణాపాయం.. కార్తీక్, దీపలను ఇంటి నుంచి పంపించిన శివన్నారాయణ..!
Karthika Deepam 2 Today Episode August 30st కృష్ణమూర్తి మరణానికి అసలు కారణం మాలినేనా?
ఇక తాజా ఎపిసోడ్లో దశరథ చెల్లెలు కాంచనకు యాక్సిడెంట్ జరిగి కాళ్లు పోయాయని మాలినికి ఆమె భర్త కృష్ణమూర్తి వచ్చి చెప్పాడు. దీంతో కాంచనకు కాళ్లు పోవడం ఏమిటని, అసలు దశరథ చనిపోలేదా? అని మాలిని ప్రశ్నించింది. వెంటనే ఆ యాక్సిడెంట్ చేయించింది నువ్వేనా? ఎందుకు చేయించావని కృష్ణమూర్తి నిలదీశాడు. దశరథ అన్నయ్యను చంపాల్సింది నువ్వేనని, కానీ నువ్వు ఆ పని చేయలేకపోయావని మాలిని చెప్పింది. తన చెల్లెలిపై ఉన్న ప్రేమతో దశరథను క్షమించి వదిలేశావని, కానీ తాను మాత్రం అలా వదిలిపెట్టలేదని స్పష్టం చేసింది. నీలాగా చేతకాని దాన్ని కాదంటూ భర్తకు కౌంటర్ ఇచ్చింది.దానికి కృష్ణమూర్తి తన చెల్లెలు దశరథను ప్రేమించి పెళ్లి చేసుకుందని, మొదట తనకు కోపం వచ్చి ఆమెపై అరిచానని చెప్పాడు. ఆ తర్వాత ఆమె జీవితం ఆమెదేనని వదిలేశానని వివరించాడు.
అయితే మాలిని మాత్రం గతాన్ని గుర్తుచేసుకుంది. సుమిత్రను తమ అన్నయ్యకు ఇచ్చి పెళ్లి చేసి ఉంటే తమ జీవితాలు ఎంత గొప్పగా ఉండేవో తనకు తెలుసని చెప్పింది. అందుకే ఆ సంబంధాన్ని తీసుకువచ్చి అందరినీ ఒప్పించానని, కానీ చివరకు సుమిత్ర దశరథను పెళ్లి చేసుకుందని పేర్కొంది. అంటే తమ అన్నయ్యను అవమానించినట్లేనని భావించిన మాలిని.. దశరథను చంపి సుమిత్రను తమ అన్నయ్యకు ఇచ్చి పెళ్లి చేస్తానని తేల్చి చెప్పింది. తాను ఈ విషయం తమ తండ్రికి చెబుతానని కృష్ణమూర్తి చెప్పడంతో మాలిని తుపాకీ తీసుకుని చచ్చిపోతానంటూ బెదిరించింది. కాంచనకు కాళ్లు పోవడానికి కారణం మనమేనని పోలీసులకు ఫిర్యాదు చేశారని, పోలీసులు వస్తే తానే నిజం చెప్పి తన చెల్లెలిని క్షమించమని అడుగుతానని కృష్ణమూర్తి చెప్పాడు.
పెళ్లి చేసుకున్న చెల్లెల్ని ఇంటికి తీసుకురావడానికి ధైర్యం లేక తన భార్యను పోలీసులకు అప్పగించాలని చూస్తున్నావా? తనకు ఏమైనా పర్వాలేదా? అంటూ మాలిని ఆగ్రహించింది. తనను ఆపే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించింది. తన చెల్లెలు పోలీసులతో వస్తే ఏం చేయాలో తనకు తెలుసని చెప్పింది. కృష్ణమూర్తి నోరు విప్పితే తన బిడ్డ బతకడని, దశరథను కూడా బతకనివ్వనని బెదిరించింది. చివరకు తనకు సాయం చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇటు భార్య వైపు నిలబడాలా? అటు తన చెల్లెలి వైపు నిలబడాలా? అనే అయోమయంలో కృష్ణమూర్తి తీవ్రంగా కలత చెందాడు. చివరకు తనను తానే కాల్చుకుని చనిపోయాడు.
సుమిత్ర పరిస్థితి విషమం.. కార్తీక్, దీపలకు ఇంట్లో చోటు లేదంటూ శివన్నారాయణ!
కృష్ణమూర్తి చనిపోయిన తర్వాత కూడా మాలిని తన ప్రతీకార ఆలోచనలను వదల్లేదు. తన భర్త చావుకు సుమిత్రే కారణమని అందరినీ నమ్మించేందుకు తాను చాలా చేయాల్సి వచ్చిందని చెప్పుకుంది. కృష్ణమూర్తి పిరికివాడని, ఆ పిరికితనమే అతడి ప్రాణాలు తీసిందని వ్యాఖ్యానించింది. తన వైపు నిలబడి ఉంటే ఈరోజు తమ ముందు బతికి నిలబడేవాడని, ఎవ్వరికి న్యాయం చేయాలో అర్థంకాక తన ప్రాణాలను తీసుకున్నాడని చెప్పింది. తన పసుపు కుంకుమలు పోవడానికి సుమిత్రే కారణమని భావిస్తున్న మాలిని.. సుమిత్రను మాత్రం వదిలిపెట్టనని నిర్ణయించుకుంది. తన కొడుకు సూరజ్ను ఎలా ట్రైన్ చేయాలో అలా ట్రైన్ చేశానని, జ్యోత్స్న అతడిని కాదని మరొకరిని పెళ్లి చేసుకోలేని పరిస్థితిని కూడా తానే తీసుకొచ్చానని చెప్పింది. ఇప్పుడు తన కూతురి పరిస్థితి చూసి సుమిత్ర ఎంతగా ఏడుస్తుందో.. దశరథ కూడా అంతే కుమిలిపోయి ఏడవాలని మాలిని కోరుకుంటుంది. మరోవైపు సుమిత్ర ఆరోగ్యం విషమించింది. ఆమె తీవ్ర షాక్కు గురైందని, బ్రెయిన్తో పాటు హార్ట్పై కూడా ప్రభావం పడిందని డాక్టర్ తెలిపారు. స్ట్రోక్ తీవ్రత ఎక్కువగా ఉందని, సమయానికి ఆస్పత్రికి తీసుకురాకపోయి ఉంటే సుమిత్ర ఈపాటికి చనిపోయేదని చెప్పారు. అంతేకాదు.. మరోసారి ఇలాంటి స్ట్రోక్ వస్తే ఆమెను కాపాడటం చాలా కష్టమని డాక్టర్ హెచ్చరించారు. సుమిత్ర ఈ స్థితిలో ఉండటానికి నీ కొడుకు, నీ కోడలే కారణమని శివన్నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు పెళ్లి దాకా ఈ వ్యవహారం ఎలా వచ్చిందని ప్రశ్నించాడు. దక్షిణామూర్తి, మాలిని గురించి తాము పూర్తిగా మరిచిపోయామని చెప్పాడు. అలాంటి దక్షిణామూర్తి మొదటిసారి తమ ఇంట్లో అడుగుపెట్టడానికి కారణం కార్తీక్ అని గుర్తుచేశాడు.
అలాగే సూరజ్ తన ఆఫీసులోకి రావడానికి కారణం దీపేనని చెప్పాడు. వచ్చిన వ్యక్తి ఎవరో పూర్తిగా తెలుసుకోకుండా కార్తీక్, దీప ఇద్దరూ అతడిని తమ జీవితాల్లోకి తీసుకొచ్చారని విమర్శించాడు. జ్యోత్స్నకు సూరజ్ భర్తగా సరైన వ్యక్తి అని చెప్పింది దీపేనని, సూరజ్ అనాథ అని చెప్పగానే కార్తీక్ నమ్మాడని గుర్తుచేశాడు. సూరజ్ గురించి పూర్తిగా తెలుసుకోకుండానే సుమిత్ర ద్వారా అందరినీ ఒప్పించేశాడని శివన్నారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు. జ్యోత్స్నను ఒక్కసారి చూసి మాట్లాడాలని, పెళ్లి ఆగిపోయినప్పటి నుంచి ఆమె అలాగే ఉండిపోయిందని చెబుతూ శివన్నారాయణ కంటతడి పెట్టాడు. జ్యోత్స్న పెళ్లి మూడు సార్లు ఆగిపోవడానికి మీరే కారణమని కార్తీక్, దీపలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.కార్తీక్, దీప, కాంచన, శ్రీధర్లను ఇంటి నుంచి వెళ్లిపోవాలని శివన్నారాయణ ఆదేశించాడు. మీ ముఖాలు ఇక చూడాలని అనుకోవడం లేదని, సుమిత్ర మిమ్మల్ని చూస్తే ఆమె ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించాడు. ఇకపై తనకు గానీ, సుమిత్రకు గానీ ఎదురుపడవద్దని తేల్చి చెప్పాడు. తల్లిదండ్రులకు విషయం చెప్పుకుని కార్తీక్ కన్నీళ్లతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.ఇదిలా ఉంటే జ్యోత్స్న గురించే ఆలోచిస్తూ బాధపడుతున్న సూరజ్తో మాలిని మాట్లాడింది. తన భర్తను రెచ్చగొట్టి దశరథను చంపేందుకు పంపించానంటూ తనపై నిందలు వేస్తున్నారని చెప్పింది. తన కొడుకు తన గురించి ఏం అనుకుంటున్నాడో అదే తనకు నిజమని మాలిని చెప్పుకుంది.మీ అత్త చేసిన పనివల్లే మీ నాన్న చనిపోయాడని సూరజ్ను నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే కార్తీక్ వాళ్ల అమ్మ కాళ్లు పోవడానికి మీ నాన్న కారణం కాదని చెప్పింది. ఆ రోజు అసలు ఏం జరిగిందో సూరజ్ పూర్తిగా తెలుసుకోవాలని మాలిని తన కథను వివరించింది. సుమిత్ర తన ఆడపడుచు అని, ఆమె పెళ్లిని తాము అంగీకరిద్దామని కృష్ణమూర్తితో చెప్పగా ఆయన కూడా ఒప్పుకున్నారని తెలిపింది. కానీ తన అత్త పోలీసులతో ఇంటిపైకి వచ్చిందని, ఎలాంటి తప్పు చేయని కృష్ణమూర్తిపై కేసు పెట్టడాన్ని ఆయన తట్టుకోలేకపోయారని చెప్పింది. ఆ బాధతోనే కృష్ణమూర్తి చనిపోయాడని సూరజ్ను నమ్మించింది.ఈ ప్రపంచంలో తాను నమ్మేది తన తల్లిని మాత్రమేనని సూరజ్ తేల్చి చెప్పాడు. తన మనసులో తండ్రి చావు, తల్లి ప్రేమ మాత్రమే ఉన్నాయని అన్నాడు.
మరోవైపు జ్యోత్స్నకు పెళ్లి చేసి రెండు కుటుంబాలను ఒక్కటిగా చేయాలని అనుకున్నానని దీప కార్తీక్తో చెప్పింది. కానీ చివరకు మనమే అందరికీ దూరమయ్యామని బాధపడింది. మనల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది ఆ సూరజ్ అని కార్తీక్ అన్నాడు. ఇదంతా ముందుగానే ప్లాన్ చేసి జరిగిందని, మనం నిజాలను అర్థం చేసుకునేలోపే సూరజ్ తన ఆట ముగించేశాడని చెప్పాడు.సూరజ్ను మనమే తీసుకొచ్చామని, లేనిపోని మంచితనంతో అతడి మాటలకు మోసపోయామని కార్తీక్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏ కుటుంబం తమ చేతుల్లో బాధ్యతలు పెట్టిందో.. అదే కుటుంబం ఇప్పుడు మనల్ని వెళ్లిపోమంటోందని బాధపడ్డాడు. అత్త సుమిత్ర పరిస్థితి ఎలా ఉందో అర్థం కావడం లేదని, కన్నతల్లిని కూడా చూసుకోలేని పరిస్థితి వచ్చిందని కార్తీక్ తీవ్రంగా కలత చెందాడు.ఇలా సుమిత్ర ప్రాణాలతో పోరాడుతుండగా.. కార్తీక్, దీపలు కుటుంబానికి దూరమవడం, మరోవైపు మాలిని ప్రతీకారం కోసం సూరజ్ను మరింత రెచ్చగొట్టడం వంటి పరిణామాలతో ఎపిసోడ్ ముగిసింది. ఇక జ్యోత్స్న పరిస్థితి ఏంటి? సూరజ్కు మాలిని చెబుతున్న మాటల్లో నిజమెంత? కార్తీక్, దీపలు తిరిగి కుటుంబానికి దగ్గరవుతారా? అన్నది తదుపరి ఎపిసోడ్లో ఆసక్తికరంగా మారనుంది.
