Chandrababu : మరో హామీ అమలు కి కూటమి రెడీ .. ముహూర్తం ఫిక్స్..!
Chandrababu : ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాల్లో పలు ముఖ్యమైన బిల్లులు, ప్రజా సమస్యలపై చర్చకు అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మరో ప్రధాన హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుండటంతో ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే సంబంధిత అంశాలపై చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. సభ సజావుగా నిర్వహించేందుకు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇటీవల ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లతో పాటు సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమావేశాలు జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇదిలా ఉండగా.. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. అయితే శాసన మండలి సమావేశాలకు మాత్రం ఆ పార్టీ ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. మండలి వేదికగా ప్రభుత్వాన్ని పలు అంశాలపై నిలదీసేందుకు వైసీపీ సిద్ధమవుతోంది.
Chandrababu : మరో హామీ అమలు కి కూటమి రెడీ .. ముహూర్తం ఫిక్స్..!
Chandrababu బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం.. అసెంబ్లీలో బిల్లు?
ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లుల్లో బీసీ రిజర్వేషన్ల అంశం అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని టీడీపీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఆ హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం ఇప్పటికే ప్రక్రియను ప్రారంభించింది. బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రస్తుతం ఆ నివేదికపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఈ నెల 18న జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించి అసెంబ్లీ వేదికగా బిల్లు లేదా తీర్మానం తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కార్యరూపంలోకి తీసుకురావడంలో భాగంగానే ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.అదే సమయంలో బీసీలకు రక్షణ కల్పించే ఉద్దేశంతో బీసీ రక్షణ చట్టం ప్రవేశపెట్టే అంశంపైనా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లు, బీసీ రక్షణ చట్టం అంశాలు ప్రధాన చర్చగా మారే అవకాశముంది.
Chandrababu డీఎస్సీ-2025, ఔట్సోర్సింగ్ అంశాలపై వైసీపీ ఫోకస్
మరోవైపు వైసీపీ కూడా అసెంబ్లీకి దూరంగా ఉన్నప్పటికీ శాసన మండలిలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహం సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యంగా డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలతో పాటు ఔట్సోర్సింగ్ నియామకాల స్కామ్లు, ఇతర ప్రజా సమస్యలను మండలిలో ప్రస్తావించాలని వైసీపీ అధినేత జగన్ తన పార్టీ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. డీఎస్సీ-2025 నియామకాలపై వస్తున్న ఆరోపణలపై సభలో చర్చకు పట్టుబట్టాలని, ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టాలని పార్టీ ఎమ్మెల్సీలకు సూచించినట్లు తెలుస్తోంది. అలాగే ఔట్సోర్సింగ్ నియామకాలు, ప్రజలకు సంబంధించిన ఇతర సమస్యలను కూడా ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వైసీపీ సిద్ధమవుతోంది.ఇక ప్రభుత్వం మాత్రం డీఎస్సీకి సంబంధించిన ఆరోపణలకు అసెంబ్లీ వేదికగానే సమాధానం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో బీసీ రిజర్వేషన్లతో పాటు డీఎస్సీ-2025 అంశం కూడా ఈ సమావేశాల్లో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంది.మొత్తంగా చూస్తే.. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు అధికార, ప్రతిపక్షాల మధ్య కీలక రాజకీయ చర్చలకు వేదికగా మారనున్నాయి. ఒకవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన బీసీ రిజర్వేషన్ల హామీ అమలుకు ప్రభుత్వం ముందడుగు వేయాలని చూస్తుండగా.. మరోవైపు డీఎస్సీ, ఔట్సోర్సింగ్ నియామకాలపై వైసీపీ ప్రశ్నలు సంధించేందుకు సిద్ధమవుతోంది. కేబినెట్ భేటీ, అసెంబ్లీ సమావేశాల అనంతరం ఈ అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
