Telangana Municipal Results 2026 : మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క ఓటు తో గెలిచిన అభ్యర్థులు వీరే !!
Telangana Municipal Results 2026 : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ప్రతి ఓటు ఎంత విలువైందో చాటిచెప్పే ఆసక్తికర సంఘటనలు వెలుగుచూశాయి. “ఒక్క ఓటుతో ఏమవుతుందిలే” అనుకునే వారికి కల్వకుర్తి, పరకాల మున్సిపాలిటీల ఫలితాలు కళ్ళు తెరిపించేలా చేసాయి.
మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క ఓటు తో గెలిచిన అభ్యర్థులు వీరే !!
Telangana Municipal Results 2026 కల్వకుర్తిలో రీకౌంటింగ్ సెన్సేషన్
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పదో వార్డులో ఓట్ల లెక్కింపు అత్యంత ఉత్కంఠగా సాగింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎజాస్ మరియు బీఆర్ఎస్ అభ్యర్థి తాహిర్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. తొలుత నిర్వహించిన లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థికి రెండు ఓట్ల మెజారిటీ రావడంతో, బీఆర్ఎస్ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేస్తూ రీకౌంటింగ్కు పట్టుబట్టారు. దీంతో అధికారులు తిరిగి ఓట్లను లెక్కించగా, కాంగ్రెస్ అభ్యర్థి ఎజాస్కు 259 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 258 ఓట్లు వచ్చాయి. చివరకు కేవలం ఒక్క ఓటు తేడాతో ఎజాస్ విజేతగా నిలిచారు. ఈ చిన్న తేడాతో గెలుపొందడం ఆ వార్డులో పెద్ద చర్చకు దారితీసింది.
పరకాలలోనూ అదే సీన్ – బొచ్చు సుభద్ర విజయం
హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలోనూ ఇలాంటి ఘటనే పునరావృతమైంది. 17వ వార్డులో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి బొచ్చు సుభద్ర-సాల్మన్, బీఆర్ఎస్ అభ్యర్థి శనిగరపు రజిని-నవీన్పై ఒక్క ఓటు తేడాతో గెలిచి చరిత్ర సృష్టించారు. ఈ వార్డులో మొత్తం 836 ఓట్లు పోలవ్వగా.. కాంగ్రెస్ అభ్యర్థికి 369, బీఆర్ఎస్ అభ్యర్థికి 368 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కూడా ఫలితంపై స్పష్టత కోసం అధికారులు రీకౌంటింగ్ నిర్వహించారు. రెండోసారి లెక్కించిన తర్వాత కూడా అదే ఫలితం రావడంతో సుభద్ర గెలుపును అధికారికంగా ప్రకటించారు. ఒక్క ఓటుతో గెలిచిన ఆనందంలో కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.
ప్రజాస్వామ్యంలో ఓటు విలువకు నిదర్శనం
సాధారణంగా వందల లేదా వేల ఓట్ల మెజారిటీతో గెలుపును చూస్తుంటాం, కానీ ఇలా ఒక్క ఓటుతో అభ్యర్థి భవితవ్యం తేలడం ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క శక్తిని చాటి చెబుతోంది. ఈ ఇద్దరు అభ్యర్థుల గెలుపు “ప్రతి ఓటు అమూల్యమైంది” అనే సందేశాన్ని ప్రజలకు బలంగా పంపింది. ఒకవేళ ఒక్క వ్యక్తి ఓటు వేయకపోయినా లేదా ఒక ఓటు అటు ఇటు అయినా ఫలితం తారుమారయ్యే పరిస్థితి ఇక్కడ కనిపించింది. విజేతలు ఒక్క ఓటుతో గెలిచినప్పటికీ, పదవి పరంగా అది పూర్తిస్థాయి విజయం కావడంతో అటు కల్వకుర్తి, ఇటు పరకాలలో ఈ ‘సింగిల్ డిజిట్’ విక్టరీ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
