Ys Jagan : చిన్న శ్రీను లోటు ని జగన్ ఎలా భర్తీ చేస్తారు..?
Ys Jagan చిన్న శ్రీను వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో విజయనగరం జిల్లా రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. జిల్లా అధ్యక్ష బాధ్యతలపై బొత్స వరుస సమావేశాలు ఆసక్తి రేపుతున్నాయి.
Ys Jagan : చిన్న శ్రీను.. పేరు చిన్నదే అయినా విజయనగరం జిల్లా వైసీపీ రాజకీయాల్లో ఆయన నిర్వహించిన బాధ్యతలు మాత్రం చాలా పెద్దవని పార్టీ వర్గాల్లో ఇప్పటికీ చర్చ జరుగుతోంది. మజ్జి శ్రీనివాసరావుగా అధికారికంగా గుర్తింపు ఉన్న చిన్న శ్రీను, ఎన్నో సంవత్సరాలుగా జిల్లాలో పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలకంగా పనిచేశారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నేతలు, కార్యకర్తలతో నేరుగా సంబంధాలు కొనసాగిస్తూ పార్టీ నిర్మాణంలో తనదైన ముద్ర వేశారన్న అభిప్రాయం ఉంది. అలాంటి నాయకుడు వైసీపీని వీడి టీడీపీలో చేరడం విజయనగరం రాజకీయాల్లో ఒక్కసారిగా పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వహించిన ఆయన నిష్క్రమణతో ఏర్పడిన ఖాళీని ఎలా భర్తీ చేయాలన్నదే ఇప్పుడు పార్టీ ముందున్న ప్రధాన ప్రశ్నగా మారింది. విజయనగరం జిల్లాలోని అనేక ప్రాంతాల రాజకీయ పరిస్థితులు, స్థానిక నాయకత్వ సమీకరణాలు, క్యాడర్ బలం వంటి అంశాలపై చిన్న శ్రీనుకు మంచి పట్టు ఉందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల్లో పార్టీ శ్రేణులతో నిరంతరం టచ్లో ఉండటం ఆయన ప్రత్యేకతగా పేర్కొంటున్నారు. అందుకే ఆయన పార్టీ మారిన తరువాత గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి వరకు వైసీపీ వర్గాల్లో దీనిపై చర్చ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఒక నాయకుడు పార్టీని వీడటం సాధారణ రాజకీయ పరిణామమే అయినప్పటికీ, సంస్థాగతంగా క్యాడర్తో బలమైన అనుబంధం ఉన్న నాయకుడు వెళ్లిపోతే దాని ప్రభావం వేరుగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న శ్రీను విషయంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోందని వైసీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. కార్యకర్తలకు అందుబాటులో ఉండటం, అవసరమైన సమయంలో సహకరించడం, స్థానిక నాయకులతో సమన్వయం చేసుకోవడం వంటి అంశాల వల్ల ఆయనకు జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఏర్పడిందని చెబుతున్నారు.
Ys Jagan : చిన్న శ్రీను లోటు ని జగన్ ఎలా భర్తీ చేస్తారు..?
Ys Jagan : చిన్న శ్రీను తర్వాత బొత్స అలర్ట్.. వరుస సమావేశాలతో క్యాడర్కు భరోసా
చిన్న శ్రీను వైసీపీని వీడిన వెంటనే సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లా పార్టీ వ్యవహారాలపై మరింతగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. చీపురుపల్లి ప్రాంతంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలోనూ బొత్స పార్టీ శ్రేణులతో మాట్లాడారు. చిన్న శ్రీను పార్టీని వీడిన అంశంపై ఆ సమావేశంలో భావోద్వేగ వాతావరణం నెలకొన్నట్లు కూడా వార్తలు వచ్చాయి.తాను పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని బొత్స భరోసా ఇచ్చినట్లు సమాచారం. చిన్న శ్రీను ఎగ్జిట్తో క్యాడర్లో ఏర్పడే సందిగ్ధతను తగ్గించి, పార్టీ శ్రేణులను తిరిగి సమన్వయం చేయడమే ఆయన ముందున్న ప్రధాన సవాల్గా కనిపిస్తోంది. అదే సమయంలో చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని రాజకీయ బాధ్యతల్లో బొత్స కుమార్తె అనూష మరింత చురుకుగా వ్యవహరించే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది.
సెప్టెంబర్ 12న విజయనగరంలో విస్తృత స్థాయి పార్టీ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగినట్లు సమాచారం. జిల్లాకు చెందిన ముఖ్య నేతలు, నియోజకవర్గ స్థాయి నాయకులు, ఇతర పార్టీ ప్రతినిధులు ఇందులో పాల్గొనేలా పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని ఎలా సిద్ధం చేయాలి, గ్రామ మరియు మండల స్థాయి క్యాడర్ను ఎలా సమన్వయం చేయాలి, కొత్త రాజకీయ పరిస్థితుల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలి వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్న అంశం కూడా కీలకంగా మారింది. చిన్న శ్రీను స్థానాన్ని భర్తీ చేయగల నాయకుడు ఎవరు? జిల్లావ్యాప్తంగా క్యాడర్ను ఒకే తాటిపైకి తీసుకురాగల వ్యక్తి ఎవరు? అన్న ప్రశ్నలకు పార్టీ నాయకత్వం సమాధానం వెతుకుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Ys Jagan జిల్లా వైసీపీ పగ్గాలు ఎవరికి?.. కోలగట్ల పేరు మళ్లీ తెరపైకి
జిల్లా అధ్యక్ష పదవి కోసం పలువురు నేతల పేర్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే కొందరు ఈ బాధ్యత తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం కూడా ఉంది. మరికొందరి పేర్లు ముందుకు వస్తున్నప్పటికీ, చిన్న శ్రీను తరహాలో జిల్లావ్యాప్తంగా తిరుగుతూ సంస్థాగతంగా చురుకైన పాత్ర పోషించగలరా అనే అంశాన్ని కూడా పార్టీ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. వైసీపీ అధిష్ఠానం కూడా జిల్లా అధ్యక్ష పదవిని ఎక్కువ కాలం ఖాళీగా ఉంచకుండా త్వరగా కొత్త నాయకుడిని ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో సమాచారం. దీనికి సంబంధించి జిల్లాలోని సీనియర్ నాయకుల నుంచి అభిప్రాయాలు, సూచనలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో మాజీ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి పేరు మరోసారి రాజకీయ చర్చల్లోకి వస్తోంది. బొత్స సత్యనారాయణ వైసీపీలో కీలకంగా మారకముందు, సుమారు 2011 నుంచి 2015 మధ్యకాలంలో విజయనగరం జిల్లాలో పార్టీ వ్యవహారాలను కోలగట్ల చూసినట్లు పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఆయనకు విజయనగరం నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించలేకపోయినప్పటికీ, అనంతరం పార్టీ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో పార్టీకి ఆర్థికంగా, సంస్థాగతంగా అండగా ఉంటూ జిల్లా స్థాయిలో బాధ్యతలు నిర్వహించారనే గుర్తింపు ఆయనకు ఉంది.అందుకే ఇప్పుడు మరోసారి జిల్లా అధ్యక్ష పదవికి కోలగట్ల పేరు పరిశీలనలోకి రావచ్చన్న చర్చ మొదలైంది. అయితే ఆయన వయస్సు, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు, జిల్లావ్యాప్తంగా నిరంతరం పర్యటించాల్సిన బాధ్యతలను దృష్టిలో పెట్టుకుంటే మళ్లీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించేందుకు ఆయన సిద్ధంగా ఉంటారా అనే సందేహాలు కూడా ఉన్నాయి.మరోవైపు చిన్న శ్రీను నిష్క్రమణతో ఏర్పడిన ఖాళీని కేవలం ఒక పదవి భర్తీతోనే పూడ్చగలమా అన్న ప్రశ్న కూడా పార్టీ ముందుంది. ఆయనకు ఉన్న వ్యక్తిగత పరిచయాలు, స్థానిక స్థాయి నెట్వర్క్, క్యాడర్తో సంబంధాలు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుంటే కొత్త అధ్యక్షుడికి పెద్ద బాధ్యతే ఎదురవుతుందని రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి చిన్న శ్రీను టీడీపీలో చేరిక విజయనగరం వైసీపీలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీసింది. ఒకవైపు బొత్స సత్యనారాయణ వరుస సమావేశాలతో క్యాడర్ను తిరిగి సమీకరించే ప్రయత్నం చేస్తుండగా, మరోవైపు జిల్లా అధ్యక్ష పగ్గాలు ఎవరికి అప్పగిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ముందున్న నేపథ్యంలో వైసీపీ తీసుకునే నిర్ణయం విజయనగరం జిల్లాలో పార్టీ భవిష్యత్ వ్యూహానికి కీలకం కానుంది.







