Revanth Reddy Cabinet : పీసీసీ చీఫ్, స్పీకర్ మార్పు? తెలంగాణ కాంగ్రెస్లో కీలక పరిణామాలు..!
Revanth Reddy Cabinet : తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని కేబినెట్లో త్వరలో భారీ ప్రక్షాళన జరగనుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కొండా సురేఖ చుట్టూ నెలకొన్న వివాదం నేపథ్యంలో మంత్రివర్గంలో పూర్తి స్థాయిలో మార్పులు చేపట్టే దిశగా అధిష్ఠానం, రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ముహూర్తం కూడా ఖరారైనట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిలోనూ మార్పు ఉండొచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత స్పీకర్ పదవిలో కూడా మార్పు జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతల నుంచి సమాచారం అందుతోంది. పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ఇద్దరినీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేబినెట్లోకి తీసుకునే అంశంపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొండా సురేఖతో పాటు మరో ఇద్దరు మంత్రులపై కూడా వేటు పడే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.
Revanth Reddy Cabinet : పీసీసీ చీఫ్, స్పీకర్ మార్పు? తెలంగాణ కాంగ్రెస్లో కీలక పరిణామాలు..!
Revanth Reddy Cabinet సెప్టెంబర్ 3న ఢిల్లీలో కీలక భేటీ.. కేబినెట్ ప్రక్షాళనపై నిర్ణయం?
తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి సెప్టెంబర్ 3వ తేదీ కీలకంగా మారనుంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ను సెప్టెంబర్ 3న ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ అధిష్ఠానం సూచించినట్లు సమాచారం. ఆ రోజు జరిగే చర్చల్లో కొండా సురేఖ వ్యవహారంతో పాటు తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కూడా విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. కొండా సురేఖకు సంబంధించిన వివాదంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే తన నివేదికను ఏఐసీసీకి పంపినట్లు తెలుస్తోంది. దీంతో ఢిల్లీ పర్యటన అనంతరం కేబినెట్ ప్రక్షాళనకు సంబంధించి కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సురేఖతో గతంలో వివాదాస్పదంగా వ్యవహరించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆగ్రహానికి గురైన ఓ మంత్రితో పాటు మరో మంత్రిపైనా వేటు పడే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ముగ్గురు మంత్రులను కేబినెట్ నుంచి తప్పించి వారి స్థానంలో కొత్తగా ముగ్గురికి అవకాశం కల్పించే అంశంపై పార్టీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ స్థానంలో ఎమ్మెల్సీ విజయశాంతిని మంత్రివర్గంలోకి తీసుకునే అంశం దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కేబినెట్లోకి ఆది శ్రీనివాస్.. పీసీసీ పగ్గాలు బీసీ మంత్రికి?
మరోవైపు సీఎం రేవంత్రెడ్డి తన కేబినెట్లో విప్ ఆది శ్రీనివాస్కు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. మహిళా కోటాలో ఒకరిని మంత్రిగా తీసుకోవాల్సి వస్తే.. కేకే కుమార్తె విజయలక్ష్మి పేరును పరిశీలిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీలో ప్రచారం సాగుతోంది. దీంతో కొత్త మంత్రుల ఎంపికలో సామాజిక, ప్రాంతీయ సమీకరణాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.ఇక పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ను కేబినెట్లోకి తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో ప్రస్తుతం కేబినెట్లో ఉన్న ఓ బీసీ మంత్రికి టీపీసీసీ పగ్గాలు అప్పగించే అంశంపై కూడా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పు ద్వారా పార్టీ అధ్యక్ష పదవి, ప్రభుత్వంలో మంత్రివర్గ ప్రాతినిధ్యం మధ్య సమతుల్యత సాధించాలనే ప్రయత్నం జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను కూడా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం ఉంది. ఆయన స్థానంలో ఉమ్మడి కరీంనగర్ ప్రాంతానికి చెందిన ఎస్సీ వర్గం నాయకుడిని స్పీకర్గా ఎంపిక చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ పరిధిలోని ఓ నేతకు కీలక అవకాశం కల్పించాలనే ఆలోచన కూడా పార్టీలో ఉన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 3న జరగనున్న ఢిల్లీ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేబినెట్ నుంచి ఎవరిని తప్పించాలి? ఎవరికి కొత్తగా అవకాశం ఇవ్వాలి? పీసీసీ అధ్యక్ష పదవికి ఎవరిని ఎంపిక చేయాలి? స్పీకర్ స్థానంలో ఎవరిని నియమించాలి? వంటి అంశాలపై అధిష్ఠానంతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.అయితే కేబినెట్ ప్రక్షాళన మాత్రం వినాయక చవితికి ముందే పూర్తయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. ఈ మార్పులు అమల్లోకి వస్తే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉండటంతో.. ప్రస్తుతం అందరి దృష్టి ఢిల్లీ సమావేశంపైనే ఉంది.
