Parag Agarwal : ఆరోజు అవమానపడ్డాడు..నేడు ప్రపంచమే శభాష్ అంటుంది..ఇది కదా భారతీయుడి సత్తా !!
Parag Agarwal : ఎలాన్ మస్క్ చేతిలో పరాభవం ఎదురైనప్పటికీ, భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ పడిలేచిన కెరటంలా తన సత్తా చాటారు. 2022లో ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్) సీఈఓ పదవి నుంచి అత్యంత అవమానకర రీతిలో తొలగించబడిన పరాగ్, రెండేళ్ల మౌనం తర్వాత అద్భుతమైన పునరాగమనంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. నిరాశకు లోనుకాకుండా తనకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రతిభనే ఆయుధంగా మలచుకుని ‘పారల్లెల్ వెబ్ సిస్టమ్స్’ (Parallel Web Systems) అనే ఏఐ స్టార్టప్ను స్థాపించారు. కేవలం రెండేళ్లలోనే ఈ సంస్థ విలువ ఏకంగా రూ. 6,000 కోట్లకు పైగా చేరుకోవడం ఆయన మేధస్సుకు నిదర్శనం. పదవి పోయినా ప్రతిభ చావదని ఆయన నిరూపించారు.
ఆరోజు అవమానపడ్డాడు..నేడు ప్రపంచమే శభాష్ అంటుంది..ఇది కదా భారతీయుడి సత్తా !!
పరాగ్ అగర్వాల్ ప్రస్థానం ముంబై ఐఐటీలో ప్రారంభమై ట్విట్టర్ సీఈఓ వరకు ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగింది. 2011లో సాధారణ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ట్విట్టర్లో చేరిన ఆయన, మెషీన్ లెర్నింగ్ మరియు ఏఐ విభాగాల్లో చూపిన ప్రతిభతో 2017లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా (CTO), 2021లో సీఈఓగా ఎదిగారు. అయితే మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేసిన సమయంలో వీరిద్దరి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. మస్క్ బహిరంగంగానే పూప్ ఎమోజీతో పరాగ్ను అవమానించడం, పగ్గాలు చేపట్టాక నిమిషాల వ్యవధిలోనే ఆయన్ని బయటకు పంపించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ అవమానాన్ని పరాగ్ మౌనంగా భరించారే తప్ప ఎక్కడా విమర్శలకు దిగలేదు.
ప్రస్తుతం పరాగ్ దృష్టి మొత్తం ఏఐ రంగంపైనే ఉంది. ఖోస్లా వెంచర్స్ వంటి దిగ్గజ సంస్థలు ఆయనపై నమ్మకంతో సుమారు రూ. 250 కోట్లకు పైగా ప్రారంభ పెట్టుబడులు పెట్టాయి. డెవలపర్ల కోసం అత్యాధునిక ఏఐ టూల్స్ తయారు చేయడమే లక్ష్యంగా ఆయన కంపెనీ పనిచేస్తోంది. ఉద్యోగం పోయిన తర్వాత ఎక్కడా మీడియాలో కనిపించకుండా, కేవలం తన పని ద్వారానే సమాధానం చెప్పిన పరాగ్, పారిశ్రామికవేత్తగా కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఒక సంస్థ నుంచి పంపించబడటం అంటే పతనం కాదని, అది కొత్త శిఖరాలను అధిరోహించడానికి నాంది అని పరాగ్ అగర్వాల్ ప్రయాణం మనకు నేర్పుతుంది.