Cancer | యువతలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయ్.. శాస్త్రవేత్తల ఆందోళన
Cancer | మన శరీరంలోని ప్రతి కణంలో డీఎన్ఏ (DNA) అనే రసాయన పదార్థం ఉంటుంది. ఇది ఆ కణం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన సూచనలు ఇస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో డీఎన్ఏలో మ్యూటేషన్లు ఏర్పడుతాయి. ఇవి కణాలు నియంత్రణ లేకుండా పెరగడానికి, చనిపోకుండా ఉండడానికి లేదా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించడానికి దారితీస్తాయి. ఈ విధంగా క్యాన్సర్ (Cancer) అనే ప్రమాదకర వ్యాధి ఉత్పత్తి అవుతుంది.
సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ డీఎన్ఏలో ఈ మ్యూటేషన్లు ఎక్కువగా సంభవిస్తాయి. అందువల్ల వృద్ధుల్లో క్యాన్సర్ కేసులు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే, ఇటీవలి కాలంలో యువతలో కూడా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్లు వైద్య నివేదికలు చెబుతున్నాయి.
యువతలో క్యాన్సర్ పెరగడానికి కారణాలు
శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, దీనికి ప్రధాన కారణం పర్యావరణ మార్పులు మరియు జీవనశైలి ప్రభావం.
ప్రాసెస్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ అధికంగా తినడం
ప్లాస్టిక్ పదార్థాల వాడకం
వ్యాయామం లేకపోవడం
ఆల్కహాల్ సేవించడం
రసాయనాల కలుషిత గాలి పీల్చడం
ఇవి అన్నీ కలిపి డీఎన్ఏకి నష్టం కలిగించి మ్యూటేషన్లను పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
రసాయనాలు, ప్లాస్టిక్ల ప్రభావం
ప్రస్తుత కాలంలో మన జీవితంలో ప్లాస్టిక్ల వాడకం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ప్లాస్టిక్ కంటైనర్లలో ఉండే కొన్ని ప్రమాదకర రసాయనాలు. ఉదాహరణకు PFAS ఆహారంతో కలిసి శరీరంలోకి చేరుతాయి. ఇవి క్యాన్సర్ కారకాలు కావచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఏ రసాయనం ఏ రకం క్యాన్సర్కు కారణమవుతుందో నిర్ధారించడానికి ఇంకా పరిశోధనలు అవసరమని తెలిపారు.