Revanth Reddy Government : హామీలు అమలు చేయకపోతే గాంధీభవన్ ముట్టడి.. రేవంత్ ప్రభుత్వానికి వికలాంగుల సంఘాల అల్టిమేటం
Revanth Reddy Government : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని, వాటిని విస్మరిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన గిద్దె రాజేష్, వికలాంగుల హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. హామీలు అమలు కాకపోతే గాంధీభవన్ను ముట్టడించే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎన్ని ఆంక్షలు విధించినా, అక్రమ అరెస్టులు చేసినా తమ పోరాటం ఆగదని ఆయన పేర్కొన్నారు.
Revanth Reddy Government : హామీలు అమలు చేయకపోతే గాంధీభవన్ ముట్టడి.. రేవంత్ ప్రభుత్వానికి వికలాంగుల సంఘాల అల్టిమేటం
Revanth Reddy Government పెన్షన్, ఉచిత బస్సు ప్రయాణం, ఉద్యోగాలపై కీలక డిమాండ్లు
ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ప్రధాన హామీలను వెంటనే అమలు చేయాలని వికలాంగుల సంఘం డిమాండ్ చేసింది. ముఖ్యంగా వికలాంగుల సామాజిక భద్రతా పెన్షన్ను నెలకు రూ.6,000కు పెంచాలని కోరింది. అలాగే తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో 100 శాతం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేసింది.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న వికలాంగుల సంక్షేమ విభాగాన్ని ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసి, వికలాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలని సూచించారు.
వికలాంగులపై జరుగుతున్న వివక్ష, దాడులు, హక్కుల ఉల్లంఘనలను అరికట్టేందుకు సంబంధిత చట్టాలను కఠినంగా అమలు చేయాలని, రాష్ట్ర డీజీపీ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని గిద్దె రాజేష్ కోరారు. పెండింగ్లో ఉన్న సంక్షేమ పథకాలు, రుణాలు, ఉపకరణాల పంపిణీ, పెన్షన్లను తక్షణమే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
Revanth Reddy Government రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని గుర్తుచేసిన గిద్దె రాజేష్, ఆ హామీని చట్టబద్ధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించే చట్టం తీసుకురావాలని కోరారు. రిజర్వేషన్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండానే ఎన్నికలు నిర్వహిస్తే భవిష్యత్తులో తలెత్తే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఉద్యమాన్ని అణచివేయొద్దు.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి
వికలాంగుల న్యాయమైన డిమాండ్ల కోసం నిర్వహిస్తున్న ఉద్యమాలను ప్రభుత్వం అణచివేయాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని గిద్దె రాజేష్ విమర్శించారు. శాంతియుత నిరసనలకు ఆంక్షలు విధించడం, కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్ చేయడం సరైన విధానం కాదన్నారు.వికలాంగుల హక్కుల కోసం పోరాడుతున్న వారిపై ఒత్తిడి తీసుకురావడం సమస్యలకు పరిష్కారం కాదని, ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. హామీలు అమలు చేసే వరకు తమ పోరాటం ఆగదని, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత విస్తరిస్తామని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, జిల్లా ఉపాధ్యక్షులు మున్నా మధు యాదవ్, మండల అధ్యక్షులు జిల్లేపల్లి శివకృష్ణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాటం కొనసాగించాలని వారు పిలుపునిచ్చారు.వికలాంగుల సంక్షేమానికి సంబంధించిన ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ స్పందనను బట్టి ఉద్యమ కార్యాచరణను మరింత ఉధృతం చేస్తామని వికలాంగుల సంఘం నాయకులు స్పష్టం చేస్తున్నారు.
