Telangana Budget : సంక్షేమానికి పెద్దపీట వేసిన తెలంగాణ సర్కార్ బడ్జెట్
Telangana Budget : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టింది. మొత్తం రూ.3,04,965 కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్లో రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా కేటాయించారు. ముఖ్యంగా రైతు సంక్షేమం, ఉచిత విద్యుత్, గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వంటి పథకాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు రూ.56,084 కోట్లు కేటాయించడం గమనార్హం.
Telangana Budget : సంక్షేమానికి పెద్దపీట వేసిన తెలంగాణ సర్కార్ బడ్జెట్
ఈ బడ్జెట్లో రైతు భరోసా కోసం రూ.18,000 కోట్లు, చేయూత పింఛన్లకు రూ.14,861 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు రూ.12,571 కోట్లు కేటాయించారు. అలాగే గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం రూ.2,080 కోట్లు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి రూ.723 కోట్లు, విద్యుత్ రాయితీ కోసం రూ.11,500 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ పథకాల ద్వారా పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా లాభపడతారని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
ఉచిత బస్సు సేవల అమలుతో RTC ఆక్యుపెన్సీ రేటు 94% కి పెరిగిందని ప్రభుత్వం వెల్లడించింది. ఉచిత బస్సు పథకం ద్వారా మహిళలకు రూ.5,006 కోట్ల మేర ప్రయోజనం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వం ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ బస్సులను ప్రవేశపెట్టింది. ఇప్పటికే నిజామాబాద్-సిద్దిపేట మార్గంలో ఈ ఎలక్ట్రిక్ బస్సు సేవలు ప్రారంభించినట్లు RTC అధికారులు తెలిపారు. పర్యావరణహిత ప్రయాణాన్ని ప్రోత్సహించేందుకు ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని ప్రభుత్వం మరింతగా ప్రోత్సహించాలని సంకల్పించింది
