పట్టు జారితే .. పార్టీ చేజారినట్టే … కొలికపూడి vs TDP హై కమాండ్ పై TTN విశ్లేషణ
ప్రధానాంశాలు:
పట్టు జారితే .. పార్టీ చేజారినట్టే ... కొలికపూడి vs TDP హై కమాండ్ పై TTN విశ్లేషణ
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని మరియు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మొన్నటికి మొన్న గంపలగూడెం నెమలి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల దగ్గర జరిగిన సీన్ చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థమవుతోంది. దేవుడికి సమర్పించాల్సిన పట్టు వస్త్రాల విషయంలో కూడా ఒకరి చేతిలో నుంచి ఒకరు లాక్కునే దాకా వెళ్లడం చూస్తుంటే అక్కడ పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అనిపిస్తోంది. అసలు ఈ గొడవ అంతా దేనికోసం అంటే నియోజకవర్గంలో ఎవరి మాట చెల్లాలి అనే చిన్న పాయింట్ దగ్గరే ఆగిపోయింది. ఎమ్మెల్యేగా గెలిచిన కొలికపూడి శ్రీనివాసరావు ఏమంటారంటే తిరువూరు నా ఏరియా ఇక్కడ అంతా నా ఇష్టమే నడవాలి ఎంపీ వచ్చి ఇక్కడ వేలు పెట్టకూడదు అని గట్టిగా చెప్తున్నారు. అటు చిన్ని వాదన ఇంకోలా ఉంది. ఎన్నికల టైంలో నీకు టికెట్ ఇప్పించడంలో గానీ పార్టీ నుంచి ఫండ్స్ ఇప్పించడంలో గానీ నేను ఎంతో హెల్ప్ చేశాను ఇప్పుడు గెలిచాక నన్నే రావద్దు అంటావా అని ఆయన గుర్రుగా ఉన్నారు.
అధికార పార్టీలో ఇలాంటి గొడవలు రావడం వెనుక మెయిన్ రీజన్ పైసా అని అందరికీ తెలుసు. పాత కాలంలో పాలెగాళ్లు ఎలాగైతే తమ ఊరి మీద పెత్తనం చేస్తూ అందరి దగ్గర వసూళ్లు చేసేవాళ్లో ఇప్పుడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా అలాగే తయారయ్యారు. ఇసుక అమ్మకాలు గానీ క్వారీలు గానీ రోడ్ల కాంట్రాక్టులు గానీ చివరకు లిక్కర్ షాపుల దగ్గర వచ్చే కమీషన్ల దాకా ప్రతి దాంట్లోనూ వాటా కావాలి. అక్కడ జరిగే వెల్త్ క్రియేషన్ అంతా తమ గుప్పిట్లోనే ఉండాలని చూస్తున్నారు. తిరువూరు విషయంలో కూడా ఇదే మెయిన్ ఇష్యూ అనిపిస్తోంది. ప్రజల సమస్యల కోసం గానీ నియోజకవర్గ అభివృద్ధి కోసం గానీ వీళ్ళు కొట్టుకోవడం లేదు కేవలం ఎవరి ఆధిపత్యం ఎంత అనే దాని మీదనే ఈ టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. దీనివల్ల లోకల్ గా ఉన్న కేడర్ కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎంపీ వెనక వెళ్లాలా లేక ఎమ్మెల్యే చెప్పింది వినాలా అని తలలు పట్టుకుంటున్నారు.
తెలుగుదేశం పార్టీ అధిష్టానం పరిస్థితి
పార్టీ పెద్దలు కూడా ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా సార్లు వీళ్ళని మంగళగిరి పార్టీ ఆఫీసుకి పిలిపించి మాట్లాడారు. కొలికపూడి శ్రీనివాసరావుని పిలిచి వార్నింగ్ ఇచ్చారు అని కూడా ప్రచారం జరిగింది కానీ రిజల్ట్ మాత్రం సున్నా. ఆయన ఆఫీసుకి వెళ్లి తల ఊపేసి రావడం మళ్ళీ తనకి నచ్చినట్టే తిరువూరులో పెత్తనం చెలాయించడం కామన్ అయిపోయింది. అసలు పార్టీకి ఎమ్మెల్యేల మీద కంట్రోల్ ఉందా లేదా అనే అనుమానం కలుగుతోంది. క్రమశిక్షణ కమిటీ అని పిలవడం వాళ్ళు వెళ్లడం ఏదో ఫోటోలకి ఫోజులు ఇవ్వడం తప్ప అక్కడ సమస్య పరిష్కారం కావడం లేదు. అధిష్టానం కూడా ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక తలనొప్పిగా ఫీల్ అవుతోంది. ఒకవేళ ఎమ్మెల్యేని గట్టిగా అంటే ఆయన తన దారి తాను చూసుకుంటాడేమో అని భయం ఇంకోపక్క ఎంపీ చిన్నికి లోకల్ గా పట్టు ఉంది కాబట్టి ఆయన్ని కూడా వదులుకోలేరు. ఇలాంటి ఇష్యూస్ ఒక్క తిరువూరులోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఉన్నాయి. వీటిని ఇప్పుడే సెట్ చేయకపోతే రేపు పొద్దున పార్టీకే పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. అసలే కొత్తగా గవర్నమెంట్ వచ్చింది ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి కానీ ఇలాంటి చిల్లర గొడవలతో టైం వేస్ట్ చేస్తే జనం కూడా అసహ్యించుకుంటారు. గెలిచిన కొద్ది రోజుల్లోనే పట్టు వస్త్రాల దగ్గర గొడవ పడటం అంటే అది రాజకీయంగా చాలా తప్పుడు సంకేతాలు పంపిస్తోంది. ఇకనైనా పార్టీ పెద్దలు కఠినంగా వ్యవహరించి ఈ గ్రూపు తగాదాలకి ఫుల్ స్టాప్ పెట్టకపోతే తిరువూరులో పార్టీ క్యాడర్ మొత్తం చెల్లాచెదురయ్యే ప్రమాదం ఉంది. ఎవరికి వాళ్లు తోపు అనుకుంటే అసలు దెబ్బ పడేది మాత్రం సామాన్య కార్యకర్తకే అని గుర్తిస్తే మంచిది.