Siddham : సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్… కుంభ‌మేళ‌ను త‌ల‌పించిన మేదరమెట్ల..!

Authored By Ramu | The Telugu News | Updated on : 11 March 2024, 11:06 am
  •  Siddham : సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్... కుంభ‌మేళ‌ను త‌ల‌పించిన మేదరమెట్ల..!

Siddham : తాజాగా ‘ సిద్ధం ‘ చివరి సభ అద్దంకిలో జరిగింది. వైసీపీ ఏర్పాటు చేసిన ఈ సభకు జనం భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సభకు హాజరైన 15 లక్షల భారీ జన సంద్రాన్ని చూసి దీన్ని రాజకీయ కుంభమేళాగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల పేరిట కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడు లో నిర్వహించిన భారీ బహిరంగ సభలు విజయవంతం అవ్వగా ఈ సభలో వైయస్ జగన్ సరికొత్త ప్రసంగాలతో తన పాలనలో జరిగిన మంచిని సవివరంగా వివరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన సభలో తనకు తన పరిపాలనకు చంద్రబాబు నాయుడు పాలనకు తేడాను వివరించారు. మేదరమెట్ల వద్ద కోల్ కత్తా, చెన్నై నేషనల్ హైవే పక్కన సుమారు 338 ఎకరాల సువిశాల మైదానంలో సిద్ధం సభ నిర్వహించారు. ఈ సభకు దక్షిణం కోస్తాలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలోని సుమారు 54 నియోజకవర్గాల నుంచి వైసీపీ శ్రేణులు తరలివచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలను, అభిమానులను, వైసీపీ శ్రేణులను, యావత్ ప్రజానీకాన్ని ఉద్దేశించి వైయస్ జగన్ ప్రసంగించారు.

సిద్ధం సభలో వై ఆకారంలో ఉన్న ర్యాంప్ పై ప్రజలకు అభివాదం చేసిన తర్వాత వైయస్ జగన్ మైక్ అందుకొని బిందువు బిందువు కలిస్తే సిందువు అయినట్లుగా ఇక్కడ భారీగా జన సందోహం తరలివచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా జనాలకు మంచి జరగటాని అడ్డుకోవడానికి వస్తున్నారని తెలిపారు. స్టార్ క్యాంపెయినర్లు, స్టార్లు, అబద్దాలకు రంగులు అద్దె ఎల్లో మీడియా తనకు లేదని, ప్రజలు మాత్రమే తనకున్న బలమని వైయస్ జగన్ నొక్కి చెప్పారు. ప్రజలను గెలిపించాలని తాను తాపత్రయ పడుతుంటే పెత్తందారులంతా ఏకమై మీ బిడ్డ జగన్ ను ఓడించాలని పరితపిస్తున్నారని, అందుకోసం కుట్రలు కుతంత్రాలతో వస్తున్నారని అన్నారు. ఒక్కమాటలో విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది అని వైయస్ జగన్ ఉద్ఘాటించారు. ఈ యుద్ధంలో వైసీపీ శ్రేణులంతా పోరాడటానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడుకు తనకు ఉన్న తేడాని గమనించమని కోరిన వైఎస్ జగన్ అందుకు అవసరమైన ఉదాహరణలు తెరపైకి తెచ్చారు. గతంలో పవన్ కళ్యాణ్, మోడీ ఫోటోలతో పాటు తన ఫోటోను ముద్రించి జనాలకు ఇచ్చిన హామీలకు సంబంధించి కరపత్రాన్ని సంతకం చేసి మరి ఇంటింటికి చంద్రబాబునాయుడు పంపారని గుర్తు చేశారు.

Siddham నాడు ఇచ్చిన హామీల్లో ఒక్క‌టైనా నేర‌వేర్చా.. వైఎస్ జ‌గ‌న్‌

ఇదే సమయంలో నాడు ముగ్గురు కలిసి ఇచ్చిన హామీలను ఒక్కటైన నెరవేరిందా అని వైయస్ జగన్ ప్రజలను ప్రశ్నించారు. ఇక జనం కూడా ఈ సమయంలో లేదు అంటూ చేతులు ఊపారు. కరోనా వంటి కష్ట కాలంలో కూడా సంక్షేమ పథకాలు, ఎన్ని కష్టాలు వచ్చినా అవి అందిస్తున్నా అందుకే ప్రజలు ఆశీర్వదించడంతోనే మన ఫ్యాన్ కు పవర్ వస్తుందని వైఎస్ జగన్ చెప్పారు. చంద్రబాబు నాయుడు సైకిల్ కు ట్యూబ్ లేదు, చక్రాలు లేవు. ఆ తుప్పు పట్టిన సైకిల్ తొక్కడానికి ఆయనకు ఇతరుల అవసరం ఉంది అని అన్నారు. అందుకోసమే ప్యాకేజీ ఇచ్చి దత్తపుత్రుడిని తెచ్చుకున్నారని అన్నారు. ఆ ప్యాకేజీ స్టార్ సైకిల్ సీటు అడగడు, తక్కువ సీట్లు ఎందుకు ఇస్తున్నాడని అడగడు, అవసరమైతే తన టీ గ్లాసు బాబుకి ఇచ్చేస్తాడు. చంద్రబాబు సైకిల్ దిగమంటే దిగుతాడు. తొయ్యమంటే తోస్తాడు. సిట్ అంటే కూర్చుంటాడు. స్టాండ్ అంటే నిల్చుంటాడు అని ఎద్దేవా చేశారు.

ఏపీలో సైకిల్ చక్రం తిరగటం లేదని ఢిల్లీ వెళ్లి మోకరిల్లారని అన్నారు. జగన్ పాలనలో ప్రజలకు మంచి జరుగుతుందనే భయంతోనే పొత్తుల కోసం నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. మన నేతలంతా మన పాలనలో జరిగిన అభివృద్ధి గురించి చెబుతూ గడపగడపకు వెళ్తుంటే చంద్రబాబు మాత్రం మీడియా సంస్థల గడపలు, ఢిల్లీలోని నేతల గడపలు ఎక్కుతున్నారని అన్నారు. మన పాలనలో జరిగిన మంచిని ప్రతి కార్యకర్త, ప్రతి వాలంటీర్, ప్రతి ఒక్కరి ఇంటింటికి వెళ్లి మీ బిడ్డ పాలనలో జరిగిన మంచిని వివరించాలని, పొరపాటున చంద్రబాబు నాయుడుకి ఓటు వేస్తే ఇప్పుడున్న సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని చెప్పాలని కోరారు. నరక లోకానికి నారా లోకానికి ఎవరు రారు కాబట్టి ఎంట్రన్స్ లో రకరకాల పథకాలతో స్వర్గం చూపిస్తారని, అలాంటి మార్కెటింగ్ టెక్నిక్ చంద్రబాబుకు అలవాటని, మరోసారి మోసం చేసేందుకు ముందుకు వస్తున్నారని వైయస్ జగన్ అన్నారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోకు శకుని పాచికలకు తేడా లేదని, పక్క రాష్ట్రంలోని ఇతర పార్టీలు ఇచ్చిన హామీలతో కిచిడీ వాగ్దానాలు చేస్తున్నారని వైయస్ జగన్ కూటమిపై నిప్పులు చెరిగారు.

Advertisement

Ramu

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి