TDP Rajya Sabha : టీడీపీ రాజ్యసభ లిస్టు లోకి ఊహించని పేర్లు..!
ప్రధానాంశాలు:
TDP Rajya Sabha : టీడీపీ రాజ్యసభ లిస్టు లోకి ఊహించని పేర్లు..!
TDP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు రాజ్యసభ ఎన్నికల వైపు ఉన్నాయి. రాష్ట్రం నుంచి త్వరలో ఖాళీ కాబోయే నాలుగు స్థానాల కోసం నోటిఫికేషన్ రాబోతోంది. గతంలో ఈ స్థానాల్లో సానా సతీష్ తో పాటు వైసీపీకి చెందిన పరిమల్ నత్వానీ, అయోధ్య రామిరెడ్డి, సుభాష్ చంద్రబోస్ ఉండేవారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. అసెంబ్లీలో కూటమికి ఉన్న భారీ మెజారిటీ వల్ల ఈ నాలుగు సీట్లు కూడా వారి ఖాతాలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఒప్పందం ప్రకారం తెలుగుదేశం రెండు, జనసేన ఒకటి, బిజేపి ఒకటి పంచుకోబోతున్నాయని తెలుస్తోంది. తెలుగుదేశం కోటాలో సానా సతీష్ ను మళ్లీ కొనసాగించే అవకాశం ఉండగా, రెండో సీటు కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. ముఖ్యంగా భారత్ బయోటెక్ అధినేత ఎల్లా కృష్ణ పేరు అనూహ్యంగా వినిపిస్తోంది. ఎన్నికల సమయంలో ఈయన పార్టీకి పెద్ద ఎత్తున సాయం చేశారని, అందుకే చంద్రబాబు ఈయన వైపు మొగ్గు చూపుతున్నారని టాక్ నడుస్తోంది. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల అది కుదరకపోతే కిలారు రాజేష్ లేదా గల్లా జయదేవ్ పేర్లను పరిశీలించే ఛాన్స్ ఉంది.
TDP Rajya Sabha : టీడీపీ రాజ్యసభ లిస్టు లోకి ఊహించని పేర్లు..!
TDP Rajya Sabha : పెద్దల సభలో కొత్త సమీకరణాలు
జనసేన కోటా కింద లింగమనేని రమేష్ పేరు బలంగా వినిపిస్తోంది. రమేష్ మొదటి నుంచి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం చంద్రబాబు ఉంటున్న నివాసం కూడా ఈయనదే కావడం విశేషం. అంతేకాకుండా విజయవాడలోని జనసేన ఆఫీస్ కు కూడా ఈయనే యజమాని. అయితే ఈయన చుట్టూ కొన్ని వివాదాలు ఉండటంతో తెలుగుదేశం లోని కొందరు నేతలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. జనసేన కోటాలో ఇచ్చినా అది కూడా చంద్రబాబు మనిషికే ఇచ్చినట్లు అవుతుందని కొందరు భావిస్తున్నారు. మరోవైపు బిజేపి తమ కోటా సీటును తమిళనాడుకు చెందిన అన్నామలైకి కేటాయించాలని చూస్తోంది.
కానీ దీనిపై ఆంధ్రప్రదేశ్ బిజేపి నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. స్థానిక నాయకులను పక్కన పెట్టి పక్క రాష్ట్రం వారికి ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. వీరిని ఒప్పించి అన్నామలైని పంపుతారా లేక ఏపీ నేతలకే అవకాశం ఇస్తారా అన్నది చూడాలి. రాజ్యసభ సీట్ల కేటాయింపు అనేది కేవలం రాజకీయ గౌరవమే కాకుండా తెరవెనుక పెద్ద పెద్ద సెటిల్మెంట్ల మీద ఆధారపడి ఉంటుందని అర్థమవుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎంపికలు ఎలాంటి మార్పులు తెస్తాయో వేచి చూడాలి. ఈ నాలుగు స్థానాల భర్తీతో దేశ రాజకీయాల్లో కూటమి బలం మరింత పెరగనుంది. చివరి నిమిషంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎంపికయ్యే అభ్యర్థులు అటు పార్టీ ప్రయోజనాలతో పాటు ఇటు సామాజిక సమీకరణాలను కూడా సంతృప్తి పరిచేలా ఉండాలి. అందుకే ఈసారి రాజ్యసభ రేసు చాలా ఆసక్తికరంగా మారింది.