YS Jagan : జగన్ కు మరో షాక్..!
YS Jagan వైసీపీ కి వరుస షాకులు తప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. కేవలం 11 సీట్లకు పరిమితం అవ్వగా, విపక్ష కూటమి భారీ విజయం సాధించి 164 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఈ ఫలితాల తర్వాత వైఎస్సార్సీపీలో అసంతృప్తి పెరిగింది. ఇప్పటికే పలువురు నాయకులు, ముఖ్యంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు పార్టీని వీడుతున్నారు. తాజాగా పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైఎస్సార్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

YS Jagan : జగన్ కు మరో షాక్..!
మర్రి రాజశేఖర్ 2004లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినప్పటి నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం 2010లో వైఎస్సార్సీపీలో చేరి, 2014 ఎన్నికల్లో కూడా ఓటమి చవిచూశారు. అయినప్పటికీ పార్టీ పట్ల విధేయంగా ఉండి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో జగన్ చేపట్టిన పాదయాత్రలో కీలక భూమిక పోషించారు. అయితే 2019లో చిలకలూరిపేట అసెంబ్లీ సీటును ఆయనకు కేటాయించలేదు. టికెట్ పొందలేకపోయినా, జగన్ హామీ మేరకు ఎమ్మెల్సీగా నియమితులయ్యారు.
కానీ మర్రి రాజశేఖర్కు మంత్రిపదవి రాలేదు. దీంతో పార్టీ పట్ల అసంతృప్తి పెరిగింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన వైఎస్సార్సీపీని వీడతారని ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఎట్టకేలకు ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గుడ్బై చెప్పారు. ఈ పరిణామం వైఎస్సార్సీపీలో మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే పలువురు నాయకులు వైఎస్సార్సీపీని వీడిన నేపథ్యంలో, మరికొందరు కూడా పార్టీ మారే అవకాశాలపై చర్చలు సాగుతున్నాయి.