Gas Shortage : ఎల్పీజీ గ్యాస్‌ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన ..!

 Authored By suma | The Telugu News | Updated on :14 March 2026,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Gas Shortage : ఎల్పీజీ గ్యాస్‌ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన ..!

Gas Shortage : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ కొరత ఏర్పడుతుందనే వార్తలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా గ్యాస్ సరఫరా నిలిచిపోతుందేమోనని భావించి అనేక మంది ముందస్తుగా సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పందిస్తూ దేశంలో ఎల్‌పీజీ కొరత లేదని స్పష్టంచేసింది. ప్రజలు భయంతో అధికంగా బుకింగ్స్ చేయడం వల్లే తాత్కాలికంగా సమస్యలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు.

Another key announcement by the central government on LPG gas supply..!

Gas Shortage : ఎల్పీజీ గ్యాస్‌ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన ..!

Gas Shortage : ముందస్తు బుకింగ్స్ వల్లే సమస్య

పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ .. దేశంలో గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని తెలిపారు. అయితే పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా గ్యాస్ అందుబాటులో ఉండకపోవచ్చనే భయంతో ప్రజలు అవసరం లేకపోయినా ముందుగానే బుకింగ్స్ చేసుకుంటున్నారని చెప్పారు. ఇటీవలి రోజుల్లో దేశవ్యాప్తంగా సుమారు 88 లక్షల వరకు గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ నమోదయ్యాయని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా అవసరం ఉన్నవారికి సరఫరాలో ఆలస్యం జరిగే అవకాశం ఉంటుందని ఆమె హెచ్చరించారు. అందువల్ల అత్యవసరం అయితేనే బుకింగ్ చేసుకోవాలని ప్రజలను కోరారు. గ్యాస్ కొరత లేకపోయినా అనవసర ఆందోళన వల్లే సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోందని ఆమె వివరించారు.

Gas Shortage : కమర్షియల్ సిలిండర్ల సరఫరా పునఃప్రారంభం

దేశంలో ఎల్‌పీజీ సరఫరా వ్యవస్థను స్థిరంగా కొనసాగించేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. కొంతకాలంగా నిలిచిపోయిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీని మళ్లీ ప్రారంభించినట్టు సుజాత శర్మ వెల్లడించారు. దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరా సజావుగా కొనసాగేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య రంగాలకు కూడా సిలిండర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రజలు పుకార్లను నమ్మకుండా అధికారిక సమాచారం ఆధారంగా మాత్రమే స్పందించాలని సూచించారు.

Gas Shortage : హార్ముజ్ మార్గం నుంచి నౌకలు రానున్నాయి

భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఎల్‌పీజీ దిగుమతిదారుగా ఉంది. మన దేశానికి వచ్చే ఎల్‌పీజీలో దాదాపు 90 శాతం సరఫరా హార్ముజ్ జలసంధి మార్గం ద్వారానే వస్తుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ సరఫరా పూర్తిగా నిలిచిపోలేదని కేంద్రం తెలిపింది. ఇరాన్ ప్రభుత్వం భారత్‌కు వచ్చే నౌకలను అడ్డుకోబోమని ఇప్పటికే భరోసా ఇచ్చినట్టు సమాచారం. త్వరలో హార్ముజ్ మార్గం నుంచి రెండు ఎల్‌పీజీ నౌకలు భారత్‌కు చేరనున్నాయని సుజాత శర్మ వెల్లడించారు. అంతేకాదు దేశంలో పెట్రోల్, డీజిల్ మరియు ముడి చమురు నిల్వలు కూడా తగినంతగా ఉన్నాయని స్పష్టం చేశారు. దేశంలో వంటగ్యాస్ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ప్రజలు అనవసరంగా భయపడకుండా సాధారణంగా బుకింగ్స్ చేసుకుంటే సరఫరా వ్యవస్థ ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

suma

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి