PM Kisan : రైతులకు నిరాశేనా ? .. కనీసం హోలీ పండుగ ముందైనా ఈ డబ్బులు వస్తాయా?
ప్రధానాంశాలు:
PM Kisan : రైతులకు నిరాశేనా ? .. కనీసం హోలీ పండుగ ముందైనా ఈ డబ్బులు వస్తాయా?
PM Kisan : దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్లకు పైగా రైతులు ప్రస్తుతం ఒకే ప్రశ్నతో ఎదురుచూస్తున్నారు. పీఎం కిసాన్ 22వ విడత నిధులు ఎప్పుడు ఖాతాల్లో జమ అవుతాయి? గతేడాది నవంబర్ 19న 21వ విడతగా రూ.2,000 రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. అప్పటి నుంచి మరో విడత విడుదల కాలేదు. ఫిబ్రవరి నెల చివరి రోజుకి చేరుకున్నా రైతుల ఖాతాల్లో ఆ నిధుల జాడ కనిపించకపోవడంతో ఆందోళన మరింత పెరిగింది. ఫిబ్రవరి 28నైనా డబ్బులు వస్తాయేమోనని అనుకున్న రైతులకు నిరాశే ఎదురైంది. నాలుగో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడ్డాయి. దీంతో ఆ రోజున జమయ్యే అవకాశాలు దాదాపు లేకపోయాయని బ్యాంకింగ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
PM Kisan : రైతులకు నిరాశేనా ? .. కనీసం హోలీ పండుగ ముందైనా ఈ డబ్బులు వస్తాయా?
PM Kisan : బ్యాంకుల వరుస సెలవులు … హోలీకి ముందు నిధులపై సందేహాలు
రైతుల ఆశలు ఇప్పుడు హోలీ పండుగపై నిలిచాయి. కనీసం పండుగకు ముందు అయినా డబ్బులు వస్తాయా అనే చర్చ గ్రామాల్లో జోరుగా సాగుతోంది. అయితే క్యాలెండర్ పరిస్థితి చూస్తే ఆశలు మందగిస్తున్నాయి. మార్చి 1 ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు. మార్చి 2, 3 తేదీల్లో కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పండుగలు, ఇతర కారణాలతో బ్యాంకులు పాక్షికంగా లేదా పూర్తిగా పనిచేయకపోవచ్చు. మార్చి 4న హోలీ పండుగ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూసివేయబడతాయి. ఈ వరుస సెలవుల ప్రభావంతో బ్యాంకింగ్ లావాదేవీల్లో జాప్యం తప్పదని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల హోలీకి ముందే రైతుల ఖాతాల్లో 22వ విడత నగదు జమ అవ్వడం కష్టసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
PM Kisan : అధికారిక ప్రకటన లేక ఆందోళన
సాధారణంగా పీఎం కిసాన్ నిధుల విడుదలకు కొన్ని రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తుంది. కానీ 22వ విడతకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ మౌనం రైతుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. నిధుల బదిలీ ప్రక్రియ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా జరుగుతుంది. బ్యాంకులకు వరుస సెలవులు ఉండటంతో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం గ్యాప్ తర్వాతే నిధులు విడుదల చేసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందువల్ల మార్చి రెండో వారంలోనైనా శుభవార్త వచ్చే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు వినిపిస్తున్నాయి.
PM Kisan : ఈ-కేవైసీ తప్పనిసరి … రైతులకు సూచనలు
22వ విడత కోసం ఎదురుచూస్తున్న రైతులు ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రం మర్చిపోవద్దని అధికారులు సూచిస్తున్నారు. అదే ఈ-కేవైసీ పూర్తి చేయడం. ఆధార్ వివరాలు సరిగా లేకపోవడం, బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ కాకపోవడం వంటి కారణాలతో చాలా మందికి గతంలో నిధులు నిలిచిపోయాయి. కాబట్టి రైతులు పీఎం కిసాన్ అధికారిక పోర్టల్లోకి వెళ్లి తమ స్టేటస్ను తనిఖీ చేసుకోవాలి. అవసరమైతే ఈ-కేవైసీ పూర్తి చేసి వివరాలను అప్డేట్ చేసుకోవాలి. ఈసారి హోలీ పండుగను రైతులు తమ సొంత ఖర్చుతోనే జరుపుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వం త్వరలోనే 22వ విడత నిధులపై ప్రకటన చేస్తుందనే ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు.