BJP : కనిపించని అయోధ్య ప్రభావం.. క‌మ‌లం మెజార్టీ సీట్లు తగ్గడానికి అసలు కారణాలేంటి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

BJP : కనిపించని అయోధ్య ప్రభావం.. క‌మ‌లం మెజార్టీ సీట్లు తగ్గడానికి అసలు కారణాలేంటి..?

 Authored By ramu | The Telugu News | Updated on :7 June 2024,2:30 pm

ప్రధానాంశాలు:

  •  BJP : కనిపించని అయోధ్య ప్రభావం.. క‌మ‌లం మెజార్టీ సీట్లు తగ్గడానికి అసలు కారణాలేంటి..?

BJP : దేశవ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో 240 స్థానాల్లో గెలిచి అతి పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ బీజేపీలో ఆ ఉత్సాహం కనిపించడం లేదు. సొంతంగా 370 పైన స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమాతో ఉన్న బీజేపీకి ఈ ఫలితాలు అసంతృప్తిని మిగిల్చాయని చెప్పొచ్చు. మరోవైపు బీజేపీతో జతకట్టి గెలుపొందిన భాగస్వామ్య పక్షాలు మాత్రం సంతోషంగానే కనిపిస్తున్నట్లు అర్థమవుతుంది. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో ముఖ్య పాత్ర పోషించవచ్చనే ఆలోచనలతో ఉన్నాయి. అయితే ఈ పదేళ్లు చూసిన బీజేపీ ప్రభుత్వం ఒకెత్తయితే.. ఇకపై చూడబోయే సంకీర్ణ ప్రభుత్వం మరో ఎత్తు అన్నట్టుగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇంతకీ బీజేపీ ఈ ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోవడానికి కారణాలేంటో కొన్నింటిని విశ్లేషిస్తే.

ప్రభుత్వంపై వ్యతిరేకత..

సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ ఎంత మంచి పాలన అందించినా ప్రజల్లో ప్రభుత్వంపై ఆశలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. మొత్తంగా ఎంతో కొంత వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే బీజేపీ వరుసగా పదేళ్లు అధికారంలో ఉండడంతో వ్యతిరేకత సహజంగానే ఉంటుంది. ఈసారి లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వ వ్యతిరేకత ఉందని బీజేపీ గుర్తించినప్పటికీ.. దాని తీవ్రతను మాత్రం పూర్తిగా అంచనా వేయలేకపోయారని స్పష్టమవుతోంది. కోవిడ్ మహమ్మారితో పాటు ఉక్రెయిన్-రష్యాలు, పాలస్తీనా – ఇజ్రాయిల్ మధ్య జరిగిన యుద్ధాల వంటివి యావత్ ప్రపంచంపైనే ప్రభావం చూపి అనేక అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఆర్థిక వ్యవస్థ సంక్షోభాలు తలెత్తినప్పటికీ ఇండియా ఆర్థిక వ్యవస్థ మాత్రం నిలకడగానే ముందుకు సాగింది. కానీ ఈ క్రమంలో ధరలు, నిరుద్యోగం పెరగడం జరిగింది. దీనికి తోడు పెట్రోల్, గ్యాస్, రైళ్లలో వృద్ధులకు ఇస్తున్న రాయితీలు, సబ్సిడీలు ఆగిపోయాయి. ఇలాంటి అంశాల కారణంగా కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది. ఇవేకాకుండా మరికొన్ని అంశాలు జత కలిసి ఫలితాలపై ప్రభావం చూపాయి.

హిందువుల చిరకాల వాంఛ తీర్చినా..

ఉత్తర ప్రదేశ్ లో అయోధ్య రామాలయం నిర్మించి హిందువుల చిరకాల వాంఛ తీర్చి నా ప్రజల నుంచి పెద్దగా మద్దతు దక్కలేదు. హిందువులంతా ఏకమై ఓటేస్తారని భావించినప్పటికీ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఫైజాబాద్ లోక్ సభ నియోజకవర్గంలోనే బీజేపీ ఓటమి చవిచూసింది.

దక్షిణాదిన ఓట్లు పెరిగినా..

ఈసారి దక్షిణాదిన కచ్చితంగా పెద్ద సంఖ్యలో స్థానాలు సాధిస్తామని బీజేపీ అగ్రనేతలు ఆశించినప్పటికీ ఓట్లు పెరిగాయి కానీ సీట్లు ఆశించినంత పెరగలేదు. ఏపీలో మిత్రపక్షంతో కలిసి 6 చోట్ల పోటీ చేసి 3 స్థానాల్లో విజయం సాధించింది. తమిళనాడులో ఓట్లు పుంజుకున్నప్పటికీ.. అవి గెలిపించలేకపోయాయి. కేరళలో ఎట్టకేలకు ఖాతా తెరిచి ఒక స్థానంలో విజయం సాధించింది. కర్ణాటకలో జేడీ(ఎస్)తో కలిసి పోటీ చేసి పరువు నిలబెట్టుకుంది. అయినప్పటికీ 2019 లోక్ సభ ఎన్నికలతో పోల్చితే స్థానాలు తగ్గాయి. అన్నింటికన్నా తెలంగాణ కమలనాథులకు ఊరటనిచ్చింది. ఇక్కడ ఎనిమిది చోట్ల గెలుపొందింది.

BJP కనిపించని అయోధ్య ప్రభావం క‌మ‌లం మెజార్టీ సీట్లు తగ్గడానికి అసలు కారణాలేంటి

BJP : కనిపించని అయోధ్య ప్రభావం.. క‌మ‌లం మెజార్టీ సీట్లు తగ్గడానికి అసలు కారణాలేంటి..?

ఇండియా కూటమి పుంజుకోవడంతో..

మోదీని గద్దె దించడమే లక్ష్యంగా కలిసి పనిచేసిన విపక్ష పార్టీల ఐక్యత చాలా రాష్ట్రాల్లో వారికి కలిసొచ్చిందనే చెప్పవచ్చు. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ , పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, కేరళలో కమ్యూనిస్టులు ఇండియా కూటమితో సంబంధం లేకుండా విడిగా పోటీ చేసినా .. మొత్తంగా వారి మద్దతు ఇండియా కూటమికే ఉండడంతో కూటమి బలం గతం కంటే బాగానే పెరిగింది. ఇంకా చెప్పాలంటే బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో ఉన్న రెండు ప్రధాన పార్టీలను తమవైపు తిప్పుకుంటే ప్రభుత్వాన్ని సైతం ఏర్పాటు చేసే స్థాయికి చేరుకుంది ఇండియా కూటమి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది