YS Jagan : బీజేపీపై గేర్ మార్చనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.?
YS Jagan : కేంద్ర, రాష్ట్ర సంబంధాలు మెరుగ్గా వుంటేనే, రాష్ట్ర అభివృద్ధి.. తద్వారా దేశ అభివృద్ధి సాధ్యమవుతుందన్న కోణంలో సంయమనం పాటిస్తూ వస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తూ వస్తున్నా, ఏపీ బీజేపీ నేతలు.. రాష్ట్ర ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తూ వస్తున్నా.. వైసీపీ సంయమనం పాటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, సంయమనాన్ని చేతకానితనంగా రాజకీయ ప్రత్యర్థులు భావిస్తున్న దరిమిలా, ఇకపై బీజేపీతోనూ అలాగే కేంద్రంతోనూ అమీ తుమీకి సిద్ధమవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారట. పోలవరం ముంపు ప్రాంతాల్లో ఇటీవల పర్యటించిన వైఎస్ జగన్, అక్కడి ప్రజలు పోలవరం ప్రాజెక్టు విషయమై కేంద్రాన్ని కాకుండా రాష్ట్రాన్ని నిలదీస్తున్న వైనంపై ఆశ్చర్యపోయారు.
పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి బాధ్యత కేంద్రానిదేనని ప్రజలకు చెప్పేందుకు వైఎస్ జగన్ ప్రయత్నించారు కూడా. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలనే సంకల్పంతో వున్నా, కేంద్రం సహకరించడంలేదన్న విషయాన్నీ వైఎస్ జగన్ విడమరచి చెప్పారు. అయినాగానీ, వైసీపీ – బీజేపీ మధ్య ఏదో సఖ్యత వుందనీ, ఆ కారణంగానే కేంద్రాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ నిలదీయడంలేదన్న విమర్శ ఒకటుంది. ఈ నేపథ్యంలో, కేంద్రంతో అమీ తుమీ తేల్చుకోవాలనీ, తద్వారా రాష్ట్ర ప్రజల ముందు తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
AP CM Ys Jagan To Change Gear Against BJP?
త్వరలో ఢిల్లీకి వెళ్ళనున్న ఏపీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీతో బేటీ అయి పోలవరం ప్రాజెక్టు సహా పలు కీలక అంశాలపై తాడో పేడో తేల్చుకోనున్నారట. ప్రత్యేక హోదా అంశం కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తుందనీ, స్టీలు ప్లాంటు విషయంలోనూ కేంద్రాన్ని వైఎస్ జగన్ నిలదీయనున్నారనీ వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే, కేంద్రాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి హోదాలో గట్టిగా నిలదీయగలిగితే, అది ఖచ్చితంగా పెను సంచలనమే అవుతుంది.
