Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్..మరో మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో భరోసా డబ్బు జమ !!
Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్. యాసంగి సీజన్కు సంబంధించి ఫిబ్రవరి 17 లేదా 18వ తేదీ నుండి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. మున్సిపల్ ఎన్నికల కోడ్ ఫిబ్రవరి 16తో ముగియనుండటంతో, తదుపరి రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్బీఐ (RBI) నుండి రూ.9,000 కోట్ల నిధులను రుణంగా సేకరించి సిద్ధంగా ఉంచింది. గత ఖరీఫ్ సీజన్లో సుమారు 69.39 లక్షల మంది రైతులకు రూ. 8,744 కోట్లు పంపిణీ చేసిన ప్రభుత్వం, ఈసారి కూడా అంతే స్థాయిలో సాయం అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. సంక్రాంతి ముందే రావాల్సిన ఈ నిధులు, నిధుల సర్దుబాటు కారణంతో ఒక నెల ఆలస్యమైనప్పటికీ, ఇప్పుడు సాగు పనుల సమయంలో అందుతుండటం రైతులకు పెద్ద ఊరట.
Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్..మరో మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో భరోసా డబ్బు జమ !!
శాటిలైట్ సర్వే
పథకం అమలులో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈసారి వినూత్నంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శాటిలైట్ సర్వే నిర్వహించింది. సాగులో లేని భూములు మరియు బోగస్ లబ్ధిదారులను గుర్తించి ఏరివేసేందుకు ఈ నివేదికను ప్రాతిపదికగా తీసుకోనున్నారు. అయితే, ప్రస్తుత యాసంగి సీజన్లో మాత్రం గత వానాకాలంలో లబ్ధి పొందిన 1.46 కోట్ల ఎకరాల భూమికి ఎటువంటి ఆటంకం లేకుండా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఎకరాకు రూ. 6,000 చొప్పున గతంలో మాదిరిగానే విడతల వారీగా (తక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల నుండి ప్రారంభించి) నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. రాబోయే మార్చి నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో, ఈ నిధుల విడుదల రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది.
పాత లబ్ధిదారులకే ప్రాధాన్యత
మరోవైపు, వానాకాలం తర్వాత కొత్తగా భూములు కొనుగోలు చేసిన రైతులు తమ పేర్ల నమోదు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పాత లబ్ధిదారులకే ప్రాధాన్యత ఇస్తుండటంతో, కొత్త దరఖాస్తుల స్వీకరణపై సందిగ్ధత నెలకొంది. మండల వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులకు ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు వేచి ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏ తేదీని కటాఫ్ (Cut-off) గా తీసుకుని కొత్త రైతులను నమోదు చేస్తారనే అంశంపై వ్యవసాయ శాఖ త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోగా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపే మెజారిటీ రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.