YS Jagan : వైఎస్ జగన్ పాలన మీద వైఎస్సార్ ఆత్మ కేవీపీ సంచలన వ్యాఖ్యలు..!
YS Jagan : ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం అటూ ఇటుగా ఉంది. ఈనేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో వైసీపీ పాలన సాగుతోంది. వైసీపీ పాలనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి.. కేవీపీ వైసీపీ ప్రభుత్వంపై కానీ.. సీఎం జగన్ పై కానీ ఏనాడూ విమర్శలు చేయలేదు. వైఎస్సార్ మరణించి చాలా ఏళ్లు అయినా ఇప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఏఐసీసీ బాధ్యతలను కేవీపీకి కాంగ్రెస్ పార్టీ అప్పగించిన విషయం తెలిసిందే.
అయితే.. తాజాగా ఏపీ పాలనపై, వైసీపీ ప్రభుత్వంపై కేవీపీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పాలనను చూస్తుంటే తనకు ఆవేదన కలుగుతోందన్నారు. తాజాగా విజయవాడలో జరిగిన పార్టీ పీసీసీ సమావేశంలో కేవీపీ పై వ్యాఖ్యలు చేశారు. ఏపీకి చాలా భవిష్యత్తు ఉంది. కానీ ఏపీలో పాలన మాత్రం సరైన దిశలో సాగడం లేదు. అసలు విభజన హామీల కోసం కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి పోరాటం లేదు. హామీల సాధన దిశగా ప్రయత్నాలు జరగడం లేదు. పొలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా ఎటూ కాకుండా పోయింది. పోలవరం దుస్థితి చూస్తే నాకు చాలా బాధేస్తోంది.. అంటూ కేవీపీ వ్యాఖ్యానించారు.
kvp ramachandra rao comments on YS Jagan
YS Jagan : ఆనాడు చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ కోసం పోలవరం నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు
నిజానికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను కేంద్రమే చూసుకోవాలని.. కానీ.. ప్రత్యేక ప్యాకేజీ కోసం చంద్రబాబు నిర్మాణ బాధ్యతలను తీసుకున్నారని కేవీపీ అన్నారు. పోలవరం విషయంలోనూ ఏపీ ప్రభుత్వం తీరు ఏం బాగోలేదు. చివరకు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఏపీ ప్రభుత్వ తీరు బాగోలేదన్నారు. అలాగే.. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే ప్రధాన లక్ష్యాలుగా కేవీపీ ఈసందర్భంగా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాటం చేస్తోంది. చేస్తూ ఉంటుంది. 2024 కాకపోతే.. 2029 వరకు అయినా ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కేవీపీ ఆశాభావం వ్యక్తం చేశారు.
