Ys Jagan : మంత్రి వ‌ర్గంలో మార్పులు.. సీఎం జ‌గ‌న్ ప్లాన్ సూప‌ర్‌..!

Authored By Akkirala | The Telugu News | Updated on : 22 June 2021, 9:18 am

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయబోతున్నారని అంటున్నారు. మార్పులు 90 శాతం దాక ఉంటాయని చెబుతున్నారు. దీంతో పదవులను కోల్పోనున్నవారు పరేషాన్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక రిక్వెస్ట్ చేద్దామని భావిస్తున్నారు. మినిస్టర్లుగా మాకు ఛాన్స్ ఇచ్చి రెండేళ్లు అవుతున్న మాట వాస్తవమే. కానీ కరోనా, లాక్డౌన్ల కారణంగా మా పనితీరును పూర్తి స్థాయిలో కనబరచుకునేందుకు ఆ సమయం సరిపోలేదు. కాబట్టి మమ్మల్ని కనీసం మరో ఏడాదైనా మంత్రులుగా ఉండనివ్వండంటూ విజ్ఞప్తి చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. దీనికి సీఎం వైఎస్ జగన్ ఏమంటారో చూడాలి. నిజం చెప్పాలంటే మంత్రులు వినిపించబోతున్న ఈ వాదనలో కూడా కొంత న్యాయం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తారని ఆశించొచ్చు.

అప్పుడే చెప్పారు. కానీ..

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పుడే  (2019లోనే) ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతం మంత్రులుగా అవకాశం వచ్చినవాళ్లలో 90 శాతం మందిని రెండేళ్ల తర్వాత మార్చుతానని అప్పుడే క్లారిటీ ఇచ్చారు. కానీ కొవిడ్ లాంటి మహమ్మారి వరుసగా రెండేళ్లు వ్యాప్తి చెందుతుందని సీఎం వైఎస్ జగన్ సైతం ఊహించి ఉండరు. కాబట్టి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణను కొన్నాళ్లపాటు వాయిదా వేసినా వేయొచ్చు. మినిస్టర్ల మనసులోని మాట ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన సలహాదారు చెవిన పడినట్లు తెలుస్తోంది. ఆయన దగ్గరికి చేరిందంటే ముఖ్యమంత్రి ముందుకి ఈ ప్రతిపాదన పోవటం నిమిషాల్లో పని.

ys jagan mohan reddy

ys jagan mohan reddy

ఎన్నికలకు ఇంకా.. : Ys Jagan

2024లో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. అందువల్ల తొందరపడకుండా కేబినెట్ లో మార్పులు, చేర్పులను పక్కనపెట్టి మంత్రులకు వారు కోరినట్లుగా అదనపు సమయాన్ని ఇవ్వటం ఉత్తమమైన పని. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల మాటకు, తన సహచరుల అభిప్రాయాలకు విలువ ఇచ్చే నాయకుడు అనే మంచి పేరుంది. ఒక వేళ వాళ్ల ఒపీనియన్ ని పట్టించుకోకుండా తాను అనుకున్నట్లుగా, ముందే చెప్పినట్లుగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేస్తే వాళ్లలో అసంతృప్తి రగిలే ప్రమాదం ఉంది.

మరో విధంగానూ..

మంత్రి పదవుల మీద ఆశపెట్టుకున్నోళ్లు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్లందరికీ ఛాన్స్ ఇవ్వటానికి కేబినెట్ లో చోటు లేదు. కాబట్టి కొందరినే మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆశావహులు సైతం పెద్ద సంఖ్యలో ఆవేదనకు గురవుతారు. ఇటు ఉన్న పదవి పోయినోళ్లు.. అటు ఆశాభంగం అయినవాళ్లు.. ఇలా అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఆ తేనె తొట్టెను కదిలించకుండా ఉండటమే బెటర్ అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో ఆయన సహా మొత్తం పాతిక మంది ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

Akkirala

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి