Jagadish Reddy : నల్లగొండ జిల్లాలో మంత్రుల అవినీతి బట్టబయలైంది : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
ప్రధానాంశాలు:
Jagadish Reddy : నల్లగొండ జిల్లాలో మంత్రుల అవినీతి బట్టబయలైంది : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నల్లగొండ జిల్లాలో మంత్రుల అవినీతి విశ్వరూపం బయటపడుతోందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో లంచాలు ఇవ్వలేదనే కారణంతో రైస్ మిల్లర్లపై కేసులు పెట్టి, అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇది రాజకీయ ప్రతీకార చర్యల భాగమని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లా మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగదీష్ రెడ్డి విమర్శించారు. రైతుబంధు నిధులను విడుదల చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని, దళారులకు ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు.
యూరియా, విద్యుత్, సాగునీరు వంటి మౌలిక అవసరాలు కూడా అందించలేకపోతున్న ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. గత పదేళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా పరిపాలన సాగిందని, కరోనా కాలంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రైతులకు అండగా నిలిచారని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేరళ ఎన్నికల కోసం తెలంగాణ నుంచి నిధులు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. రైతుబంధు డబ్బుల విషయంలో హామీలు నిలబెట్టుకోకుండా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో రైతులకు స్వర్ణయుగం నెలకొన్నదని ఇప్పుడు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.
