Palvai Sravanthi : మనుగోడు పంచాయితీ – కాంగ్రెస్లో కాకరేపుతున్న పాల్వాయి స్రవంతి ఆడియో టేప్.!
Palvai Sravanthi : కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్ట్రాంగ్ పవర్ సెంటర్ అయిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పుడు రెండు దారులయ్యారు. ఒకరు కాంగ్రెస్ పార్టీలో వున్నా, లేనట్టే. ఇంకొకరేమో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకీ అలాగే మునుగోడు శాసన సభ సభ్యత్వానికీ రాజీనామా చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖరారు కాగా, కాంగ్రెస్ పార్టీ నుంచి కృష్ణారెడ్డి బరిలోకి […]
Palvai Sravanthi : కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్ట్రాంగ్ పవర్ సెంటర్ అయిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పుడు రెండు దారులయ్యారు. ఒకరు కాంగ్రెస్ పార్టీలో వున్నా, లేనట్టే. ఇంకొకరేమో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకీ అలాగే మునుగోడు శాసన సభ సభ్యత్వానికీ రాజీనామా చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖరారు కాగా, కాంగ్రెస్ పార్టీ నుంచి కృష్ణారెడ్డి బరిలోకి దిగే అవకాశం వుందన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారధ్యంలో మునుగోడులో ‘బల ప్రదర్శన’ తరహాలో బహిరంగ సభ నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. ఈ సమావేశంలో కృష్ణారెడ్డి సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు.
కాగా, మునుగోడులో గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతికి టిక్కెట్ ఇవ్వాల్సి వచ్చినా, ఆమెను కాదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వడం జరిగిందనీ, స్రవంతి త్యాగం వృధా అయ్యిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అదే రేవంత్ రెడ్డి, ఇప్పుడు కృష్ణారెడ్డిని రంగంలోకి దించుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఈ మొత్తం వ్యవహారంపై పాల్వాయి స్రవంతి ఓ కాంగ్రెస్ కార్యకర్తతో ‘గోడు’ వెల్లగక్కారు. ‘హుజూరాబాద్లో ఏం జరిగిందో చూశాం. రేవంత్ రెడ్డి ఇంకో పరాభవం కోరకుంటున్నారా.? కాంగ్రెస్ పార్టీని ఏం చేద్దామనుకుంటున్నారు.?’ అంటూ పాల్వాయి స్రవంతి ఆ కార్యకర్తతో అన్నారు. ‘మునుగోడు అంటే పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి ఎంతో ఇష్టమైన నియోజకవర్గం.. అక్కడి నుంచి మీరే పోటీ చెయ్యాలి..’ అంటూ ఆ కార్యకర్త (కింది స్థాయి నాయకుడట) స్రవంతితో వ్యాఖ్యానించారు.
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ చేసే ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సర్వశక్తులూ ఒడ్డుతారు. ఆయనకు బీజేపీ నుంచి అదనపు బలం వచ్చి చేరనుంది. అధికార టీఆర్ఎస్ ఎలాగూ అస్త్ర శస్త్రాలన్నిటినీ ప్రయోగిస్తుంది.
ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు.. కాంగ్రెస్ పార్టీని ముంచేస్తుంది తప్ప, ఏ రకంగానూ అది కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం కాదు.