TG Municipal Results : మున్సిపల్ ఎన్నికల్లో రూ.20 కోట్లు ఖర్చు చేసిన ఓడిన అభ్యర్థి..ఏ పార్టీ అభ్యర్దో తెలుసా ?
TG Municipal Results : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్ కార్పొరేషన్ వేదికగా జరిగిన ఒక ఖరీదైన ఓటమి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కాటిపల్లి శమంత ఓటమి పాలవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నామినేషన్ ప్రక్రియలోనే ఆమె మున్సిపాలిటీకి ఉన్న రూ.8 కోట్ల పన్ను బకాయిలను చెల్లించి ‘నో డ్యూ సర్టిఫికెట్’ పొందడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మేయర్ పీఠం దక్కించుకోవాలనే పట్టుదలతో 19వ డివిజన్ నుంచి పోటీ చేసిన ఆమె, ఎన్నికల ప్రచారం నుండి పోలింగ్ వరకు దాదాపు రూ.20 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే, భారీగా నగదు పంపిణీ చేసినా ఓటర్లు మాత్రం బీజేపీ అభ్యర్థి వైపే మొగ్గు చూపారు. డబ్బే గెలిపిస్తుందనే అంచనాలను తలకిందులు చేస్తూ స్థానిక ప్రజలు తీర్పునిచ్చారు.
TG Municipal Results : మున్సిపల్ ఎన్నికల్లో రూ.20 కోట్లు ఖర్చు చేసిన ఓడిన అభ్యర్థి..ఏ పార్టీ అభ్యర్దో తెలుసా ? ఏ
ఇక నిజామాబాద్ కార్పొరేషన్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ‘హంగ్’ ఏర్పడింది. మొత్తం 60 డివిజన్లలో బీజేపీ 28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, కాంగ్రెస్ 17, ఎంఐఎం 14, బిఆర్ఎస్ కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకున్నాయి. మేయర్ పీఠానికి అవసరమైన 31 స్థానాల మ్యాజిక్ ఫిగర్ను ఎవరూ అందుకోలేకపోయారు. ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని కాంగ్రెస్ ధీమాగా ఉండగా, ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లతో ఇందూరు పీఠాన్ని కైవసం చేసుకుంటామని బీజేపీ సవాల్ చేస్తోంది. ఈ నెల 16న జరగబోయే మేయర్ ఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది.
మొత్తంగా రాష్ట్రవ్యాప్త ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో 66 చోట్ల కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. వార్డుల పరంగా చూస్తే మొత్తం 2,581 వార్డులలో కాంగ్రెస్ 1,347 చోట్ల గెలిచి తన సత్తా చాటింది. బిఆర్ఎస్ 13 మున్సిపాలిటీలకే పరిమితం కాగా, బీజేపీ ఒక్క మున్సిపాలిటీని కూడా సొంతంగా దక్కించుకోలేకపోయింది. కార్పొరేషన్లలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు ఖర్చు చేసినా, ప్రజలు నాయకత్వం మరియు అభ్యర్థి గుణగణాలకే ప్రాధాన్యత ఇస్తారని నిజామాబాద్ ఫలితం మరోసారి నిరూపించింది.