Rythu Bharosa : రైతు భరోసా సమాచారం సీఎం రేవంత్ కే తెలియదట ..ఇదెక్కడి విడ్డురం !!
Rythu Bharosa : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రైతు భరోసా, నిరుద్యోగ ఉపాధి, మరియు ప్రభుత్వ ఖజానా స్థితిగతులపై ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు వివిధ వర్గాల నుండి విమర్శలకు దారితీశాయి.
రైతు భరోసాపై సందిగ్ధత – అన్నదాతల ఆగ్రహం
హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసాపై చేసిన వ్యాఖ్యలు రైతులను విస్మయానికి గురిచేశాయి. రైతు భరోసా నిధులు అందరికీ అందాయా లేదా అనే విషయం తనకు తెలియదని, కేవలం తన వద్ద ఉన్న సమాచారం ప్రకారమే మాట్లాడుతున్నానని ఆయన పేర్కొనడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి యాసంగి సాగుకు సంబంధించి పెట్టుబడి సాయం కోసం లక్షలాది మంది రైతులు నిరీక్షిస్తుండగా, ప్రభుత్వం మాత్రం పంపిణీ పూర్తి కాలేదని అంగీకరించకుండా, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలు మరియు రైతు సంఘాలు మండిపడుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియకుండా పథకాలు అమలు చేశామని ప్రకటించడం అబద్ధపు ప్రచారమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిరుద్యోగుల అవమానం
కొత్వాల్గూడ ఎకో హిల్పార్క్ ప్రారంభోత్సవంలో మూసీ నది అభివృద్ధి ద్వారా యువతకు కూరగాయల షాపులు, హోటళ్లు, ట్యాక్సీల ద్వారా ఉపాధి కల్పిస్తామన్న సీఎం మాటలు నిరుద్యోగులను కించపరిచేలా ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల ముందు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల హామీ ఇచ్చి, ఇప్పుడు చిరు వ్యాపారాల వైపు మళ్ళించడమేమిటని యువత ప్రశ్నిస్తోంది. మరోవైపు, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వడానికి ఖజానా ఖాళీగా ఉందని చెబుతూనే, మూసీ వద్ద రూ. 5వేల కోట్లతో గాంధీ విగ్రహం ఏర్పాటుకు నిధులు ఎక్కడి నుండి వస్తాయని ఉద్యోగ సంఘాలు నిలదీస్తున్నాయి. నెలకు వెయ్యి మంది రిటైర్ అవుతున్నారని, వారి కోసం వెయ్యి కోట్లు భారం అవుతున్నాయని సీఎం అనడం వారి హక్కులను కాలరాయడమేనని ఆగ్రహం వ్యక్తమవుతోంది.
అపార్ట్మెంట్ వాసులపై అసహనం
జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్కు ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదన్న కోపంతోనే సీఎం అపార్ట్మెంట్ వాసులను టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాము బస్తీవాసుల ఓట్లతోనే గెలిచామని, అపార్ట్మెంట్లలో ఉండేవారు ఓట్లేస్తే గెలవలేదని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో వివక్ష చూపేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా మధుపార్క్ అపార్ట్మెంట్ కూల్చివేత వివాదం నడుస్తున్న తరుణంలో, తమకు అపార్ట్మెంట్ వాసుల మద్దతు అవసరం లేదని పరోక్షంగా చెప్పడం ద్వారా తన మొండి వైఖరిని ప్రదర్శించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు భూములు లేవు, నిధులు లేవు అని చెబుతూనే, అసైన్డ్ భూముల జోలికి వస్తున్నారని ప్రొఫెసర్ కాశీం వంటి వారు హెచ్చరించడం ప్రభుత్వ భవిష్యత్తు కార్యాచరణపై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తోంది.