YSRCP : అందరికీ పదవులు ఇచ్చి.. ఆ ఒక్క సీనియర్ నేతకు మాత్రం సీఎం జగన్ ఎందుకు పదవి ఇవ్వలేదు?

Authored By Emmaneni | The Telugu News | Published on: August 5, 2021, 8:00 am

విశాఖ జిల్లా : విశాఖ జిల్లాలో దాదాపుగా అందరికీ పదవులు దక్కాయి. ఒకవేళ ఎవరూ లేరనుకున్నా కూడా గుర్తు పెట్టుకుని మరీ అటు వైఎస్ జగన్ ఇటు విజయసాయిరెడ్డి వారికి పదవులు ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే పన్నెండేళ్ల నుంచి పార్టీలోనే సాగుతున్న వారందరికీ సీఎం జగన్ బాగానే న్యాయం చేశారు అన్న మాట అయితే పార్టీలో సర్వత్రా వినిపిస్తోంది. అయితే అందరి చూపూ ఒకే ఒకరి మీద ఉంది. ఆయనే విశాఖ సిటీ వైసీపీ ప్రెసిడెంట్ వంశీకృష్ణ శ్రీనివాస్. ఆయన మరోమారు అన్యాయం అయిపోయారా అన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది.

Ysrcp

Ysrcp

విశాఖ వైసీపీ అంటే జగన్ కి మొదట గుర్తుకు రావాల్సింది వంశీకృష్ణ శ్రీనివాస్ పేరే. ఎందుకంటే వైసీపీని ఏర్పాటు చేశాక ఈ జిల్లా నుంచి మొదట చేరింది వంశీకృష్ణ శ్రీనివాసే. అంతే కాదు, అప్పట్లో ఓదార్పు యాత్రకు విశాఖ వస్తే వైఎస్ జగన్ వంశీకృష్ణ శ్రీనివాస్ ఇంటికే వెళ్ళి బస చేశారు. అంతలా జగన్ తో మంచి రిలేషన్ ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ కి పదవులు మాత్రం అందని పండే అవుతున్నాయి. మరీ ముఖ్యంగా చూసుకుంటే 2019 నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ కు ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. 2019 ఎన్నికల్లో తూర్పు ఎమ్మెల్యే సీటు వచ్చినట్లే వచ్చి జారిపోయింది. నాడు విశాఖ మేయర్ పదవి ఇస్తామని చెప్పి పక్కన పెట్టి.. 6 నెలల క్రితం జరిగిన మేయర్ ఎన్నికల్లో కూడా వంశీకృష్ణ శ్రీనివాస్ ని అనూహ్యంగా తప్పించేశారు.

ఇక .. ఎమ్మెల్సీ కే ఛాన్స్.. YSRCP 

విశాఖ మేయర్ కి సరిసాటిగా మరో పదవి ఉంది. అదే వీఎమ్మార్డీయే పోస్ట్. ఈ కీలకమైన పదవిని తూర్పు వైసీపీ ఇంచార్జి అక్రమాని విజయనిర్మలకు ఇచ్చి వంశీకృష్ణ శ్రీనివాస్ కి మళ్ళీ హ్యాండ్ ఇచ్చారు. వంశీకృష్ణ శ్రీనివాస్ కి రాష్ట్ర స్థాయిలో కీలకమైన నామినేటెడ్ పదవిని ఇస్తామని ఆ మధ్య విజయసాయిరెడ్డి కూడా చెప్పుకొచ్చారు. వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా జగన్ ని స్వయంగా కలసి తన బాధ చెప్పుకున్నారు. ఇంత జరిగిన తరువాత కూడా వంశీకృష్ణ శ్రీనివాస్ కి మళ్లీ మొండి చెయ్యే చూపించారని ఆయన అనుచరులు మండిపోతున్నారు. తమ నేత కరివేపాకు అయ్యారా అని కూడా ఆగ్రహిస్తున్నారు. పార్టీలో వెనక వచ్చిన వారికే పదవులా అంటూ విమర్శిస్తున్నారు.

Ys jagan

Ys jagan

ఏపీలో తొందరలో 13 దాకా ఎమ్మెల్సీ పదవులు భర్తీ చేస్తారని టాక్ వినిపిస్తోంది. స్థానిక సంస్థల కోటాలో ఎనిమిది, ఎమ్మెల్యే కోటాలో అయిదు ఎమ్మెలీ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ పదవులు అన్నీ వైసీపీకే దక్కుతాయి. ఇక వంశీకృష్ణ శ్రీనివాస్ కి ఇవ్వాలి అనుకుంటే ఈ పదవులే ఉన్నాయని అంటున్నారు. అయితే ఈ పదవుల విషయంలో కూడా పెద్ద ఎత్తున పోటీ ఉంది. కానీ విశాఖ జిల్లాకు ఈసారి తప్పకుండా ఒక పదవి ఖాయమని అంటున్నారు. దాన్ని వంశీకృష్ణ శ్రీనివాస్ కి ఇస్తారని చెప్పి ప్రస్తుతానికి అనునయిస్తున్నారు. మరి రాజకీయ లెక్కలు ఏమైనా మారితే వంశీకృష్ణ శ్రీనివాస్ కి ఈ పదవి దక్కదన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. ఏదేమైనా వంశీకి పదవి ఇస్తేనే, వైఎస్ జగన్ కేడర్ కు పూర్తి న్యాయం చేసినట్లు అవుతుందన్న వాదన గట్టిగానే వెల్లువెత్తుతోంది. మరి వైఎస్ జగన్ మదిలో ఏముందో వేచి చూడాల్సిందే.

Emmaneni

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp