T20 World Cup 2026: సెమీస్ రేసులో భారత్ నిలవాలంటే ఏం చేయాలి? అలా చేయకపోతే ఇంటికే..!
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్కు గట్టి షాక్ తగిలింది. సూపర్-8లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ ఇండియా 76 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమితో భారత్ సెమీఫైనల్ అవకాశాలు ఒక్కసారిగా క్లిష్టంగా మారాయి. కేవలం మ్యాచ్ ఓడిపోవడమే కాకుండా, నెట్ రన్ రేట్ Net Run Rate భారీగా పడిపోవడం ఇప్పుడు జట్టును ఆందోళనకు గురిచేస్తోంది.
T20 World Cup 2026: సెమీస్ రేసులో భారత్ నిలవాలంటే ఏం చేయాలి? అలా చేయకపోతే ఇంటికే..!
T20 World Cup 2026 మ్యాచ్ హైలైట్స్: కుప్పకూలిన బ్యాటింగ్ ఆర్డర్
నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 187/7 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రోటీస్ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్ (63) అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లతో రాణించాడు. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 111 పరుగులకే కుప్పకూలింది. మార్కో జాన్సెన్ 4 వికెట్లతో భారత బ్యాటింగ్ వెన్ను విరిచాడు.
T20 World Cup 2026 టీమ్ ఇండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?
ఈ ఓటమి తర్వాత భారత్ నెట్ రన్ రేట్ -3.800 కు పడిపోయింది. ప్రస్తుతం గ్రూప్-1లో భారత్ ఆఖరి స్థానంలో ఉంది. సెమీస్ చేరాలంటే టీమ్ ఇండియా ముందున్న సమీకరణాలు ఇవే. సూపర్-8లో భారత్ తన తదుపరి మ్యాచ్లను జింబాబ్వే (ఫిబ్రవరి 26), వెస్టిండీస్ (మార్చి 1) లతో ఆడనుంది. ఈ రెండు మ్యాచ్ల్లోనూ భారత్ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. కేవలం గెలిస్తే సరిపోదు, సౌతాఫ్రికాతో పోగొట్టుకున్న రన్ రేట్ను ఈ రెండు మ్యాచ్ల్లో పూడ్చుకోవాలి. ముఖ్యంగా వెస్టిండీస్, జింబాబ్వేలపై భారీ విజయాలు సాధిస్తేనే పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ భారత్ ఒక మ్యాచ్ ఓడిపోయినా లేదా తక్కువ మార్జిన్తో గెలిచినా, సౌతాఫ్రికా తన మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ గెలవాలని కోరుకోవాలి. అప్పుడు గ్రూప్ నుండి రెండో జట్టుగా భారత్ వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే భారత్కు ప్రతి మ్యాచ్ నాకౌట్తో సమానం. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నట్లుగా, బ్యాటింగ్ విభాగం పుంజుకుంటేనే సెమీస్ కల నిజమవుతుంది.
ఫిబ్రవరి 26న చెన్నైలో భారత్ వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత భారత్ వర్సెస్ వెస్టిండీస్ మార్చి 1 కోల్కతాలో జరగనుంది. క్రికెట్ అభిమానులు ఆశించినట్లుగా భారత్ పుంజుకుని సెమీస్ చేరుతుందో లేదో చూడాలి.