Virat Kohli : గ్లౌజ్ లు విసిరేసి .. హెల్మెట్ నేలకేసి కొట్టి.. ఎందుకంత కోపం కోహ్లీ..?
ప్రధానాంశాలు:
Virat Kohli : గ్లౌజ్ లు విసిరేసి .. హెల్మెట్ నేలకేసి కొట్టి.. ఎందుకంత కోపం కోహ్లీ..?
Virat Kohli : క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీ అంటేనే ఒక ఎనర్జీ. మ్యాచ్ గెలిచినా, ఓడినా, వికెట్ పడినా తనదైన శైలిలో రియాక్ట్ అవ్వడం కోహ్లీకి అలవాటు. కానీ తాజాగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ చూపించిన కోపం మాత్రం అభిమానులను షాక్కు గురిచేసింది. వాంఖడే స్టేడియంలో ఆదివారం ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన పోరులో కోహ్లీ ఆడిన తీరు, ఆ తర్వాత తను ప్రదర్శించిన ఆగ్రహం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. హాఫ్ సెంచరీ మార్కును అందుకున్న వెంటనే అవుటైన కోహ్లీ, పెవిలియన్ వైపు వెళ్తూ తన చేతిలో ఉన్న గ్లౌజులను విసిరేసి, హెల్మెట్ను నేలకేసి కొట్టడం కెమెరాకు చిక్కింది. అసలు కింగ్ కోహ్లీకి అంత కోపం రావడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లు ముంబై బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా ఓపెనర్ ఫిల్ సాల్ట్ కేవలం 36 బంతుల్లోనే 78 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. ఆ తర్వాత వచ్చిన రజత్ పాటిదార్ కూడా 20 బంతుల్లోనే 53 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. వీరంతా 200 పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తుంటే, కోహ్లీ మాత్రం ఒక పక్క వికెట్ పడకుండా నిలకడగా ఆడుతూ వచ్చాడు. కోహ్లీ 38 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అయితే తన అర్థశతకాన్ని పూర్తి చేసుకున్న తర్వాతి బంతికే హార్దిక్ పాండ్యా బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అంతసేపు కష్టపడి క్రీజులో సెట్ అయ్యి, భారీ స్కోరు చేసే టైమ్లో ఫుల్ టాస్ బంతికి అవుటవ్వడం కోహ్లీకి అస్సలు నచ్చలేదు.
Virat Kohli : గ్లౌజ్ లు విసిరేసి .. హెల్మెట్ నేలకేసి కొట్టి.. ఎందుకంత కోపం కోహ్లీ..?
Virat Kohli : వాంఖడేలో విధ్వంసం – ఆర్సీబీ ఘన విజయం
నిజానికి కోహ్లీ కోపానికి ప్రధాన కారణం తన వ్యక్తిగత స్కోరు కంటే కూడా, తన బ్యాటింగ్ వేగంపై తనకున్న అసంతృప్తే అనిపిస్తోంది. పక్కన ఉన్న బ్యాటర్లు సునామీలా పరుగులు సాధిస్తుంటే, తాను మాత్రం తక్కువ స్ట్రైక్ రేట్తో నెమ్మదిగా ఆడటం వల్ల జట్టు స్కోరుపై ఏమైనా ప్రభావం పడుతుందేమో అన్న ఆందోళన కోహ్లీలో కనిపించింది. సరిగ్గా తాను గేర్ మార్చి భారీ షాట్లు ఆడాల్సిన సమయంలో పాండ్యా వేసిన చెత్త బంతికి చిక్కడం అతన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. పెవిలియన్ చేరుకున్నాక కూడా డగౌట్లో కూర్చోకుండా తన అసహనాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే ఆర్సీబీ బ్యాటర్ల సమిష్టి కృషితో నిర్ణీత 20 ఓవర్లలో 240 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కూడా గట్టిగానే పోరాడింది. షెర్ఫేన్ రూథర్ఫర్డ్ 71 పరుగులతో చెలరేగినప్పటికీ ముంబై నిర్ణీత ఓవర్లలో 222 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా బెంగళూరు జట్టు 18 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి చేరుకుంది. మ్యాచ్ గెలిచినప్పటికీ విరాట్ కోహ్లీ ప్రవర్తన మాత్రం చర్చనీయాంశంగా నిలిచింది. తనపై తనకున్న నమ్మకం, జట్టు కోసం తను పడే తపనే ఆ కోపానికి కారణమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.