Telangana Chicken shops : తెలంగాణలో చికెన్ సెంటర్ల బంద్ సక్సెస్ : దిగివచ్చిన పౌల్ట్రీ కంపెనీలు.. భారీగా తగ్గిన ధరలు
Telangana Chicken shops : తెలంగాణ Telangana రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చికెన్ సెంటర్ల బంద్ ఎట్టకేలకు ముగిసింది. తమ డిమాండ్ల సాధన కోసం చిల్లర చికెన్ వ్యాపారులు చేసిన పోరాటం ఫలించింది. కార్పొరేట్ పౌల్ట్రీ కంపెనీల ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 1, 2026 నుంచి చేపట్టిన నిరవధిక బంద్ తో రాష్ట్రవ్యాప్తంగా మాంసం మార్కెట్ స్తంభించిపోయింది. బంద్ కు అనూహ్య స్పందన రావడం, వ్యాపారులంతా ఏకతాటిపైకి రావడంతో పౌల్ట్రీ కంపెనీలు తమ మొండి వైఖరిని వీడి చివరకు దిగివచ్చాయి. చికెన్ వ్యాపారుల ప్రధాన డిమాండ్లను అంగీకరించడంతో రాష్ట్రవ్యాప్తంగా చికెన్ సెంటర్లు తిరిగి తెరుచుకుంటున్నాయి.
Telangana Chicken shops bandh : తెలంగాణలో చికెన్ సెంటర్ల బంద్ సక్సెస్: దిగివచ్చిన పౌల్ట్రీ కంపెనీలు.. భారీగా తగ్గిన ధరలు
Telangana Chicken shops bandh భారీగా తగ్గిన లైవ్ బర్డ్ ధరలు.. పునరుద్ధరించబడిన కమీషన్లు
పౌల్ట్రీ కంపెనీలు, చికెన్ సెంటర్ల యజమానుల మధ్య ప్రధానంగా ధరలు, కమీషన్ల విషయంలోనే వివాదం తలెత్తింది. గతంలో కిలో బ్రాయిలర్ (లైవ్ బర్డ్) ధర రూ.185 వరకు పలకడంతో సామాన్యులు చికెన్ కొనాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. అదే సమయంలో షాపుల నిర్వాహకులకు ఇచ్చే కమీషన్ మార్జిన్ ను కంపెనీలు కిలోకు రూ.15 – రూ.20 నుండి అమాంతం రూ.8 – రూ.10 కి తగ్గించేశాయి. దీనివల్ల షాపుల అద్దెలు, కరెంటు బిల్లులు, పనివాళ్ల జీతాలు కూడా వెళ్లని పరిస్థితి దాపురించింది. బంద్ దెబ్బకు దిగివచ్చిన కంపెనీలు.. వరంగల్ తో పాటు రాష్ట్రంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో లైవ్ బర్డ్ ధరను రూ.185 నుంచి ఏకంగా రూ.125 కు తగ్గించాయి. అలాగే వ్యాపారులకు ఇచ్చే మార్జిన్ ను సైతం గతంలో మాదిరిగానే కిలోకు రూ.15, ఆపై ఇచ్చేందుకు అంగీకరించాయి.
Telangana Chicken shops bandh బంద్ విజయవంతం.. ఓపెన్ కానున్న షాపులు
చికెన్ సెంటర్ల బంద్ నూరు శాతం విజయవంతమైందని ఉమ్మడి వరంగల్ జిల్లా బ్రాయిలర్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సముద్రాల వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 80 శాతానికి పైగా చికెన్ సెంటర్లు స్వచ్ఛందంగా ఈ బంద్ లో పాల్గొన్నాయని ఆయన తెలిపారు. పౌల్ట్రీ కంపెనీలు చర్చలకు ముందుకు వచ్చి సమస్యను పరిష్కరించడంతో బంద్ ను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. బంద్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్క చికెన్ షాపు నిర్వాహకుడికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
నాటుకోడి, మటన్ కు అమాంతం పెరిగిన డిమాండ్
బ్రాయిలర్ చికెన్ అందుబాటులో లేకపోవడంతో మాంసం ప్రియులు ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపారు. దీంతో మార్కెట్లో ఒక్కసారిగా నాటుకోడి, మటన్ కు డిమాండ్ భారీగా పెరిగింది. సాధారణ రోజుల్లో నాటుకోడి ధర ఎక్కువగా ఉండటం వల్ల కొనుగోళ్లు కాస్త తక్కువగా ఉంటాయి. కానీ, చికెన్ సెంటర్లు బంద్ కావడంతో పల్లెల్లో నాటు కోళ్లు పెంచే రైతులు వాటిని మార్కెట్ కు తరలించి మంచి లాభాలు పొందారు. ధర కాస్త ఎక్కువైనా సరే వినియోగదారులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు. మరోవైపు మటన్ (మేక, గొర్రె మాంసం) విక్రయాలు సైతం 20 నుంచి 25 శాతం మేర పెరిగాయి. ముందస్తు సమాచారం ఉండటంతో మటన్ వ్యాపారులు ఎక్కువ సంఖ్యలో జీవాలను కోసి సిద్ధంగా ఉంచడం విశేషం.
హైదరాబాద్ లో మహా ధర్నా.. ప్రభుత్వ జోక్యానికి డిమాండ్
చికెన్ వ్యాపారుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద బుధవారం భారీ మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఉమ్మడి వరంగల్ జిల్లా సహా రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా వ్యాపారులు తరలివచ్చారు. రాష్ట్రంలో చిల్లర చికెన్ వ్యాపారుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, కార్పొరేట్ పౌల్ట్రీ కంపెనీల గుత్తాధిపత్యాన్ని అడ్డుకోవాలని వారు నినాదాలు చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకోవాలని, విధాన పరంగా చికెన్ ధరలు, కమీషన్లను ప్రభుత్వమే నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. పౌల్ట్రీ కంపెనీల అక్రమాలను అడ్డుకుని, చిన్న వ్యాపారులను ఆదుకోవాలని వారు కోరారు.
మొత్తానికి రైతులు, చిల్లర వ్యాపారుల సమష్టి పోరాటంతో పౌల్ట్రీ కంపెనీల గుత్తాధిపత్యానికి బ్రేక్ పడింది. చికెన్ ధరలు సామాన్యులకు అందుబాటులోకి రావడం, షాపుల నిర్వాహకులకు కమీషన్లు పెరగడంతో అటు వినియోగదారుల్లోనూ, ఇటు వ్యాపారుల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది.