Telangana Farmers : వరి సాగు మానేస్తే ఎకరాకు రూ.10 వేల సాయం.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం
Telangana Farmers : తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పెరగడంతో వరి సాగు Paddy Cultivation విస్తీర్ణం రికార్డు స్థాయిలో పెరిగింది. నేడు దేశంలోనే అత్యధికంగా వరిని పండించే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ అగ్రభాగాన నిలుస్తోంది. అయితే, ఈ స్థాయిలో వరి పండటం ఒకవైపు సంతోషాన్నిస్తున్నా.. మరోవైపు ప్రభుత్వానికి, పర్యావరణానికి తీవ్ర సవాళ్లను విసురుతోంది. ఈ నేపథ్యంలో రైతులను ‘పంట మార్పిడి’ Crop Diversification వైపు ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. వరి సాగు మానేసి ఇతర ఆరుతడి పంటలు, వాణిజ్య పంటలు వేసే రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం అందించాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
Telangana Farmers Scheme: వరి సాగు మానేస్తే ఎకరాకు రూ.10 వేల సాయం.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం
Telangana Farmers Scheme వరి సాగుతో వస్తున్న ప్రధాన సమస్యలు ఇవే
రాష్ట్రంలో రైతులు ఏళ్ల తరబడి కేవలం వరి పంటనే సాగు చేయడం వల్ల అనేక దుష్ప్రభావాలు ఎదురవుతున్నాయని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భూగర్భ జలాల పతనం: వరి పంటకు అత్యధికంగా నీరు అవసరం. రైతులు బోర్ల ద్వారా విపరీతంగా నీటిని తోడేస్తుండటంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు Groundwater levels అడుగంటిపోతున్నాయి.
భూసారం తగ్గిపోవడం: పంట మార్పిడి Crop rotation చేయకుండా, ఏటా ఒకే పంట (వరి) వేయడం వల్ల భూమిలోని సహజ సిద్ధమైన పోషకాలు నశించిపోయి భూసారం దారుణంగా పడిపోతోంది.
నిల్వ కష్టాలు: రికార్డు స్థాయిలో పండుతున్న ధాన్యాన్ని సేకరించడం, ఆ బియ్యాన్ని గోదాముల్లో నిల్వ చేయడం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారుతోంది.
Telangana Farmers Scheme ప్రభుత్వంపై తీవ్ర ఆర్థిక భారం
ధాన్యం సేకరణ, నిల్వ ప్రక్రియల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎకరాకు సుమారు రూ.20 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. గత వానాకాలం సీజన్లో తెలంగాణ రైతులు దేశంలోనే అత్యధికంగా 148 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించారు. ఈ ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం ఏకంగా రూ.24 వేల కోట్లు వెచ్చించింది. ఆ తర్వాత వచ్చిన యాసంగి సీజన్లోనూ 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో గోదాములన్నీ నిండిపోయాయి.
దీనికి తోడు, రేషన్ బియ్యం కోసం కేంద్ర ప్రభుత్వం FCI సేకరించే కోటాపై పరిమితులు విధించింది. ఇక అంతర్జాతీయ మార్కెట్కు మన బియ్యాన్ని ఎగుమతి చేద్దామంటే.. థాయ్లాండ్, వియత్నాం వంటి దేశాల నుంచి విపరీతమైన పోటీ ఎదురవుతోంది. దీంతో మిగులు నిల్వలు నిరుపయోగంగా పేరుకుపోతున్నాయి. ఈ ఆర్థిక, నిల్వ భారాన్ని తగ్గించుకోవడానికే ప్రభుత్వం ‘పంట మార్పిడి’ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది.
పంజాబ్ మోడల్ తరహాలో.. ఎకరాకు రూ.10 వేలు
మనకంటే ముందే పంజాబ్ రాష్ట్రం ఈ సమస్యను గుర్తించింది. అక్కడ వరి సాగును తగ్గించి ఇతర పంటల వైపు మళ్లే రైతులకు హెక్టారుకు రూ.17 వేలు (ఎకరాకు సుమారు రూ.6,800) ప్రోత్సాహకంగా అందిస్తున్నారు. అదే మోడల్ను మరింత ఆకర్షణీయంగా తెలంగాణలో అమలు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. వరికి బదులుగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పప్పుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, ఉద్యానవన పంటలు వేసే రైతులకు ఎకరాకు రూ.10,000 నగదు సాయం Financial Assistance అందించే ప్రతిపాదనను పరిశీలిస్తోంది.
ప్రత్యామ్నాయ పంటలు ఏంటి? మార్కెటింగ్ ఎలా?
రైతులు వరి మానేస్తే ఏ పంటలు వేయాలి? వాటికి లాభాలు వస్తాయా? అనే భయం లేకుండా వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రణాళిక రచిస్తోంది. పప్పుధాన్యాలు, కూరగాయలు, క్యాప్సికం, పూలు, ఇతర విదేశీ (ఎక్సోటిక్) పండ్ల సాగుపై అధికారులతో నివేదిక సిద్ధం చేయిస్తున్నారు. ఈ డేటా ఆధారంగా ప్రాంతాల వారీగా ఏ నేలకు ఏ పంట అనువైనదో ఒక జాబితాను రూపొందించి రైతులకు అందించనున్నారు.
కేవలం ఎకరాకు 10 వేలు ఇచ్చి చేతులు దులుపుకోకుండా.. రైతులు పండించిన ప్రత్యామ్నాయ పంటలకు కనీస మద్దతు ధర MSP కల్పించడంతో పాటు, మార్కెటింగ్ సౌకర్యాలను కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
త్వరలోనే క్యాబినెట్ ఆమోదం
ఇప్పటికే ఈ పథకం విధివిధానాలపై సీఎం రేవంత్ రెడ్డి.. వ్యవసాయ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులతో ప్రాథమిక చర్చలు జరిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, పారదర్శకంగా ఈ నిధులను నేరుగా వారి ఖాతాల్లోకి ఎలా జమ చేయాలి అనేదానిపై కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. రాబోయే కేబినెట్ సమావేశంలో Cabinet Meeting ఈ పంట మార్పిడి ప్రోత్సాహక పథకంపై సమగ్రంగా చర్చించి, సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ఈ ‘మెగా స్కీమ్’ను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం అమలైతే భూగర్భ జలాలు సేవ్ అవ్వడమే కాకుండా, రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.