Amaravati : గుడ్న్యూస్.. అమరావతి లో రెండు భారీ ప్రాజెక్ట్స్ రెడీ..!
Amaravati అమరావతిలో 21.77 కిలోమీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ భవనాలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఈ నెల 13న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్న ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు, ఏర్పాట్ల పూర్తి వివరాలు.
Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల్లో మరో కీలకమైన ముందడుగు పడుతోంది. ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డు (సబ్ ఆర్టీరియల్ E3 రోడ్డు తో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవన సముదాయాలను ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే వేగంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ), ఏపీ సీఆర్డీఏ, గుంటూరు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనులను పర్యవేక్షిస్తున్నాయి. రాజధాని అమరావతిని అన్ని ప్రాంతాలతో మెరుగ్గా అనుసంధానించడంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. ఈ రహదారి అమరావతి నగరంలోని ప్రధాన రహదారులను అనుసంధానించే కీలక మార్గంగా నిలవనుంది. ఇప్పటికే పలు దశల్లో నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది.
Amaravati : గుడ్న్యూస్.. అమరావతి లో రెండు భారీ ప్రాజెక్ట్స్ రెడీ..!
Amaravati 13న సీఎం చంద్రబాబు పర్యటన.. ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఖరారైన నేపథ్యంలో అధికారులు అమరావతి ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. సోమవారం అమరావతి అభివృద్ధి సంస్థ ఛైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీపార్థసారథి, ఏపీ సీఆర్డీఏ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్, గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎస్పీ వకుల్ జిందాల్, జిల్లా సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తదితరులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. ముఖ్యమంత్రి భద్రతా విభాగానికి చెందిన అధికారులు, గుంటూరు జిల్లా పాలనా సిబ్బందితో కలిసి వారు స్టీల్ బ్రిడ్జి ప్రాంతాన్ని, సభా వేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సీఎం పర్యటన సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదేవిధంగా బకింగ్హామ్ కెనాల్ వద్ద చేపడుతున్న బ్యూటిఫికేషన్ పనులను కూడా అధికారులు పరిశీలించారు. గుంటూరు ఛానెల్, కొండవీటివాగులపై కొనసాగుతున్న తుది నిర్మాణ పనుల పురోగతిని సైతం సమీక్షించారు. మిగిలిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి వచ్చే ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఇతరులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు.అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా చేపడుతున్న ప్రతి ప్రాజెక్టు విషయంలోనూ పనుల నాణ్యతతో పాటు రాకపోకలకు అనువుగా ఉండే మౌలిక వసతులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.
Amaravati 21.77 కిలోమీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్డు.. ప్రత్యేకతలు ఇవే
అమరావతి రాజధాని నగరంలో E3 రోడ్డుగా పిలిచే సీడ్ యాక్సెస్ రోడ్డు అత్యంత కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టుగా ఉంది. రాజధానిలోని N1 నుంచి N17 వరకు ఉన్న ప్రధాన రహదారులను అనుసంధానించేలా ఈ రహదారిని అభివృద్ధి చేశారు. మొత్తం 21.77 కిలోమీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో ఈ రోడ్డు నిర్మాణం జరిగింది. ఈ రహదారి దొండపాడు గ్రామం వద్ద ప్రారంభమై రాయపూడి, వేంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి మీదుగా కొనసాగుతుంది. చివరకు మణిపాల్ హాస్పిటల్స్ సమీపంలో జాతీయ రహదారి NH-16తో అనుసంధానమవుతుంది. దీంతో అమరావతి రాజధాని ప్రాంతానికి మెరుగైన రోడ్డు కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది.
Amaravati సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణాన్ని మొత్తం మూడు దశల్లో చేపట్టారు.
E3 ఫేజ్-1: 14.35 కిలోమీటర్లు
E3 ఫేజ్-2: 3.92 కిలోమీటర్లు
E3 ఫేజ్-3: 3.50 కిలోమీటర్లు
మొత్తం పొడవు: 21.77 కిలోమీటర్లు
ఈ రహదారిని ప్రపంచస్థాయి ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫేజ్-1, ఫేజ్-2లో ఇరువైపులా 11 మీటర్ల క్యారేజ్వేలతో 9 లైన్ల రహదారి ఏర్పాటు చేశారు. రహదారి మధ్యలో ప్రత్యేకంగా బీఆర్టీఎస్ కారిడార్ను, రెండు వైపులా 11 మీటర్ల వెడల్పుతో సర్వీస్ రోడ్లను నిర్మించారు.దొండపాడు నుంచి ఉండవల్లి ఇస్కాన్ టెంపుల్ కరకట్ట రోడ్డు వరకు ప్రజల రాకపోకల కోసం బీఆర్టీఎస్ మార్గాన్ని ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో రాజధాని ప్రాంతంలో ప్రజా రవాణాకు కూడా ఈ రహదారి కీలకంగా మారే అవకాశం ఉంది.భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సీడ్ యాక్సెస్ రోడ్డులో కేవలం రాకపోకల సౌకర్యాలకే పరిమితం కాకుండా అనేక మౌలిక వసతులను సమగ్రంగా ఏర్పాటు చేశారు. రహదారికి ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థను నిర్మించారు. భూగర్భంలో మంచినీటి సరఫరా పైప్లైన్లు, గ్యాస్ నెట్వర్క్, విద్యుత్ లైన్లు, సీవరేజ్ వ్యవస్థ, ఐసీటీ కేబుళ్లకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు.అదేవిధంగా పాదచారుల కోసం కాలినడక బాటలు, ప్రత్యేక సైకిల్ ట్రాక్లు, గ్రీనరీ బెల్ట్లను కూడా ఏర్పాటు చేశారు. దీంతో రహదారి కేవలం వాహనాల రాకపోకలకు మాత్రమే కాకుండా భవిష్యత్ రాజధాని నగర అవసరాలకు అనుగుణంగా సమగ్ర మౌలిక వసతుల మార్గంగా రూపొందుతోంది.
విజయవాడ వైపు నుంచి అమరావతికి మరింత మెరుగైన కనెక్టివిటీ
అమరావతి రాజధాని నగరానికి విజయవాడ వైపు నుంచి తక్షణ, మెరుగైన అనుసంధానం కల్పించడంలో భాగంగా E3 రోడ్డు ఫేజ్-3లో పలు భారీ నిర్మాణాలను చేపట్టారు. ఓల్డ్ విజయవాడ-మంగళగిరి హైవేకు అనుసంధానం చేస్తూ 280 మీటర్ల పొడవైన మేజర్ స్టీల్ బ్రిడ్జి నిర్మించారు.అదేవిధంగా 360 మీటర్ల పొడవైన నాలుగు లైన్ల రోడ్డు, బకింగ్హామ్ కెనాల్పై 110 మీటర్ల స్టీల్ బ్రిడ్జి కూడా నిర్మించారు. ఈ నిర్మాణాలు అమరావతి-విజయవాడ మధ్య రాకపోకలను మరింత సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.ఫేజ్-3ను భవిష్యత్తులో ఆరు లైన్ల ఎలివేటెడ్ కారిడార్గా అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం. ఈ కారిడార్ నేరుగా జాతీయ రహదారి-16 (NH-16)తో అనుసంధానం కానుంది. దీంతో అమరావతి నుంచి జాతీయ రహదారికి వేగవంతమైన కనెక్టివిటీ మరింత మెరుగుపడే అవకాశం ఉంది.
సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి మొత్తంగా 320.54 ఎకరాల భూమి అవసరమైంది. ఇందులో ఇప్పటివరకు 278.93 ఎకరాల భూమిని సేకరించి, సంబంధిత పనులను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మించిన భవన సముదాయాలు కూడా ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఒకే రోజున సీడ్ యాక్సెస్ రోడ్డు, ప్రజాప్రతినిధుల భవనాల ప్రారంభోత్సవం జరగనుండటంతో అమరావతి పునర్నిర్మాణంలో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.మొత్తంగా చూస్తే.. రాజధాని అమరావతిలో రోడ్లు, బ్రిడ్జిలు, ప్రజా రవాణా, డ్రైనేజీ, నీటి సరఫరా, విద్యుత్, గ్యాస్, సీవరేజ్, ఐసీటీ వంటి మౌలిక వసతులను ఒకే ప్రణాళికలో అభివృద్ధి చేసే దిశగా పనులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 13న సీఎం చంద్రబాబు సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ భవనాలను ప్రారంభించనుండటం అమరావతి అభివృద్ధిలో మరో కీలక ఘట్టంగా నిలవనుంది.







