Andhra Pradesh : ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తరలివస్తున్న టాప్ కంపెనీస్
Andhra Pradesh : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి, ముఖ్యంగా టెక్ రంగంలో గణనీయమైన ఊతం ఇవ్వనుంది. ఈ పెట్టుబడులతో రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడమే కాకుండా, ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నారు.
గూగుల్ సుమారు 6 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో విశాఖపట్నంలో 1 గిగావాట్ (GW) డేటా సెంటర్ను నిర్మించనుంది. ఈ డేటా సెంటర్తో పాటు, దానికి అవసరమైన పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా గూగుల్ అభివృద్ధి చేయనుంది. ఇది అమెరికా వెలుపల గూగుల్ నిర్మించనున్న అతిపెద్ద డేటా సెంటర్ కావడం విశేషం. విశాఖపట్నం భౌగోళికంగా కీలక ప్రాంతంలో ఉండటం, మెరుగైన కనెక్టివిటీకి అవకాశం ఉండటం ఈ పెట్టుబడికి కారణమైందని తెలుస్తోంది.

Andhra Pradesh : ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తరలివస్తున్న టాప్ కంపెనీస్
ఇటీవల సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ గూగుల్ ప్రతినిధులతో సమావేశమై, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈ చర్చల ఫలితంగానే గూగుల్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు స్పష్టమవుతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఆంధ్రప్రదేశ్కు, ముఖ్యంగా విశాఖపట్నానికి డిజిటల్ రంగంలో కీలక కేంద్రంగా మారే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.