High Fees : బ్రేకింగ్ న్యూస్ .. ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులకు తీపికబురు .. ఫీజుల విషయంలో సీఎం కీలక నిర్ణయం
ప్రధానాంశాలు:
High Fees : ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులకు తీపికబురు .. ఫీజుల విషయంలో సీఎం కీలక నిర్ణయం
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర విధానం రూపొందించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా కీలక నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలు అతిక్రమించి అధిక ఫీజులు వసూలు చేస్తే వారి గుర్తింపును రద్దు చేయడమే కాకుండా, అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి వసూలు చేసేలా కఠిన నిబంధనలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఫీజుల నియంత్రణపై రూపొందించిన ప్రతిపాదనలను ప్రజాభిప్రాయం కోసం ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఉంచాలని సూచించారు.
హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన ఈ సమీక్షలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి ప్రధాన అంశంగా నిలిచింది. కోర్ అర్బన్ రీజియన్లో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో రాజీ పడకూడదని సీఎం స్పష్టం చేశారు. భారతీయ విద్యా భవన్, జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ స్థాయి సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి, ప్రతి విద్యార్థికి పాలు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పాలను విజయ డెయిరీ నుంచి సేకరించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత పర్యవేక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర విద్యా విధానం కోసం ఏర్పాటు చేసిన కమిషన్ 305 పాఠశాలలను సందర్శించి, 46 సమావేశాల ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను సేకరించింది. కమిషన్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ మోడల్ అమలు చేయాలని సిఫార్సు చేసింది. కోర్ అర్బన్ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర నియోజకవర్గాల్లో కూడా పైలట్ ప్రాజెక్టుల రూపంలో అభివృద్ధి చేయాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల ప్రభుత్వ పాఠశాల నమూనాను విస్తరించి, విద్యార్థులకు రవాణా సదుపాయాలతో పాటు పూర్తి మౌలిక వసతులు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. విద్యార్థుల రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సుల అవకాశాలను కూడా పరిశీలించాలని హితవు పలికారు. రాష్ట్రంలో ప్రైవేట్ ఫీజుల నియంత్రణ నుంచి ప్రభుత్వ పాఠశాలల అప్గ్రేడేషన్ వరకు సమగ్ర మార్పుల దిశగా ప్రభుత్వం వేస్తున్న అడుగులు విద్యారంగంలో విస్తృత చర్చకు దారితీస్తున్నాయి.