AP : తిరుపతిలో కలకలం .. ప్రియుడి కోసం కన్నకూతురిని హతమార్చిన తల్లి
ప్రధానాంశాలు:
AP : తిరుపతిలో కలకలం .. ప్రియుడి కోసం కన్నకూతురిని హతమార్చిన తల్లి
AP : ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నగరంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో వివాహం చేసుకోవాలనే ఆశతో ఓ యువతి తన స్వంత చిన్నారిని హత్య చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటన తిరుపతిలోని పోస్టల్ కాలనీలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం పోస్టల్ కాలనీకి చెందిన ఆశాలత (19)కు గతంలో వివాహం జరిగింది. అయితే భర్తతో తరచూ తలెత్తిన గొడవల కారణంగా ఆమె అతనితో విడిపోయి కొంతకాలంగా తన తల్లి వద్దే నివసిస్తోంది…
AP : తిరుపతిలో కలకలం .. ప్రియుడి కోసం కన్నకూతురిని హతమార్చిన తల్లి
ఈ క్రమంలో ఏర్పేడు మండలం చెన్నంపల్లికి చెందిన ఓ యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. పరిచయం క్రమంగా సన్నిహిత సంబంధంగా మారి ఇద్దరూ సహజీవనం కొనసాగిస్తూ త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.అయితే ఆశాలతకు ముందే జన్మించిన చిన్నారి వారి వివాహానికి అడ్డుగా మారుతుందని భావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె తీవ్ర నిర్ణయం తీసుకుని కన్నబిడ్డనే హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని స్వర్ణముఖి నది సమీపంలో పూడ్చిపెట్టినట్లు విచారణలో తేలింది. ఇదిలా ఉండగా ఈ నెల 19వ తేదీ నుంచి తన కూతురు మరియు మనవరాలు కనిపించడం లేదని ఆశాలత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అనుమానాస్పద అంశాలపై ఆశాలతను ప్రశ్నించారు. విచారణలో ఆమెనే తన చిన్నారిని హత్య చేసినట్లు అంగీకరించినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని మరింత విచారణ చేపట్టారు. ప్రియుడి కోసం తల్లి ఇంతటి దారుణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర ఆగ్రహం, ఆవేదనకు దారితీసింది.