TDP Fire on BJP : బీజేపీ పై టీడీపీ లో తీవ్ర అసహనం
TDP Fire on BJP : ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) తీరుపై తెలుగుదేశం పార్టీ (TDP) తీవ్ర అసహనంతో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా కీలకమైన అంశాల్లో బీజేపీ అండగా నిలవకపోవడం వల్ల తాము రాజకీయంగా ‘బద్నాం’ అవుతున్నామని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ కోపాన్ని టీడీపీ అనుకూల సోషల్ మీడియా వేదికలు, యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా బహిరంగంగానే వెళ్లగక్కుతుండటం కూటమిలో మొదలైన చీలికలకు సంకేతంగా కనిపిస్తోంది. హిందుత్వ అజెండాలో తామే పేటెంట్ అని భావించే బీజేపీ, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాల పట్ల అంటీముట్టనట్లు వ్యవహరించడం పట్ల తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
TDP Fire on BJP : బీజేపీ పై టీడీపీ లో తీవ్ర అసహనం
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం ఈ విభేదాలను మరింత ముదిర్చింది. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను బీజేపీ నేతలు ఎక్కడా బలంగా బలపరచకపోవడం గమనార్హం. హిందుత్వం ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఎదిగిన బీజేపీ, ఏపీలో మాత్రం ఈ అంశంపై మౌనంగా ఉండటాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. సీబీఐ పర్యవేక్షణలోని సిట్ (SIT) విచారణ నివేదిక తర్వాత ఆరోపణలు చేసిన వారే ఇరకాటంలో పడే పరిస్థితి తలెత్తినప్పుడు, బీజేపీ కేవలం ‘ప్రేక్షక పాత్ర’ పోషించడం కూటమి మధ్య ఉన్న సమన్వయ లోపాన్ని ఎత్తిచూపుతోంది.
2029 ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతుంటే, మతపరమైన భావోద్వేగాల విషయంలో బీజేపీ మరియు దాని అనుబంధ సంఘాలైన విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ వంటివి మద్దతుగా నిలవకపోవడం చర్చనీయాంశమైంది. మఠాధిపతులు, పీఠాధిపతులు కూడా ఈ వివాదంలో టీడీపీకి అండగా మాట్లాడకపోవడంతో వైసీపీ రాజకీయంగా పైచేయి సాధించే అవకాశం దక్కిందని కూటమి నేతలు వాపోతున్నారు. భాగస్వామ్య పక్షంగా ఉంటూ కూడా మొక్కుబడి రాజకీయాలు చేయడం వల్ల కూటమి భవిష్యత్తుపై నీలినీడలు ముసురుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఈ సమీకరణలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.