Drumstick Farming : కరువు నేలపై మునగతో విజయ గాథ .. ఏడాదికి రూ. 30 లక్షలు సంపాదిస్తున్న వృద్ధ రైతు స్ఫూర్తిదాయక ప్రయాణం ..!
ప్రధానాంశాలు:
Drumstick Farming : కరువు నేలపై మునగతో విజయ గాథ .. ఏడాదికి రూ. 30 లక్షలు సంపాదిస్తున్న వృద్ధ రైతు స్ఫూర్తిదాయక ప్రయాణం ..!
Drumstick Farming : మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా పరిధిలో ఉన్న పంఢర్పూర్ ప్రాంతం కరువు బాధితంగా పేరుగాంచింది. ఇక్కడ నీటి వనరులు చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువమంది రైతులు సంప్రదాయంగా చెరుకు పంటనే సాగు చేస్తూ వస్తున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన వృద్ధ రైతు ఉద్ధవ్ గోవర్ధన్ కౌలాగే మాత్రం ఈ పద్ధతికి భిన్నంగా ఆలోచించాడు. తరతరాలుగా సాగుచేస్తున్న చెరుకును వదిలి తక్కువ నీటితో అధిక లాభాలు వచ్చే పంట కోసం అన్వేషించాడు. చెరుకు పంటకు ఎక్కువ నీరు అవసరం కావడం ఫ్యాక్టరీల నుంచి చెల్లింపులు ఆలస్యం కావడం వల్ల లాభాలు చాలా తక్కువగా ఉండేవి. ఒక ఎకరానికి కేవలం రూ.50 వేల ఆదాయం మాత్రమే రావడం అతన్ని కొత్త మార్గం వైపు నడిపించింది.
Drumstick Farming income of lakhs.. an ideal for farmers
Drumstick Farming : ఒక వీడియోతో మారిన జీవిత దిశ
2021లో యూట్యూబ్లో మునగ సాగుపై ఒక వీడియో చూసిన ఉద్ధవ్కు కొత్త ఆలోచన వచ్చింది. మునగలో ఉన్న పోషక విలువలు, ఔషధ గుణాలు, మార్కెట్లో ఉన్న భారీ డిమాండ్ ఇవన్నీ అతనిని ఆకర్షించాయి. ముఖ్యంగా ఈ పంట తక్కువ నీటితో కూడా బాగా పెరుగుతుందని తెలుసుకొని వెంటనే మునగ సాగు వైపు మళ్లాడు. మొదట స్థానికంగా ఓడీసీ-3 రకం విత్తనాలతో సాగు ప్రారంభించినా ఆశించిన దిగుబడి రాలేదు. తర్వాత ఒడిశా రాష్ట్రంలోని ఖోర్ధా రకం విత్తనాలను అధిక ధరకు కొనుగోలు చేసి మళ్లీ సాగు చేశాడు. ఈసారి మంచి ఫలితాలు వచ్చాయి. కేవలం ఐదు నెలల్లోనే పంట చేతికి రావడంతో ఉద్ధవ్ విశ్వాసం మరింత పెరిగింది. మొదట ఒక ఎకరంలో ప్రారంభించిన సాగును క్రమంగా ఐదు ఎకరాలకు విస్తరించాడు.
Drumstick Farming : మునగతో లక్షల ఆదాయం .. రైతులకు ఆదర్శం
ప్రస్తుతం ఉద్ధవ్ ప్రతి ఎకరంలో సుమారు 25 టన్నుల మునగకాయలను ఉత్పత్తి చేస్తున్నాడు. దీని ద్వారా ఎకరానికి రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాడు. ఖర్చులు తీసేసిన తర్వాత కూడా రూ.4 లక్షల వరకు లాభం మిగులుతోంది. మొత్తం ఐదు ఎకరాల్లో సంవత్సరానికి రూ.30 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. అదనంగా మునగ విత్తనాలను విక్రయించడం ద్వారా మరో రూ.4–5 లక్షల ఆదాయం పొందుతున్నాడు. మునగ పంటకు మొదటి మూడు నెలల వరకు మాత్రమే నీరు అవసరం. ఆ తర్వాత తక్కువ నీటితోనే సాగు కొనసాగుతుంది. ఇది కరువు ప్రాంతాలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. పైగా మునగ మొక్కలు దాదాపు పది సంవత్సరాల పాటు దిగుబడి ఇస్తాయి. తొమ్మిది సంవత్సరాల పాటు గరిష్ట ఉత్పత్తి లభించడం వల్ల దీర్ఘకాలిక ఆదాయం కూడా అందుతుంది. ఉద్ధవ్ తన పంటను కర్ణాటకలోని బెల్గాం, అలాగే మహారాష్ట్రలోని ముంబై, పుణే మార్కెట్లలో విక్రయిస్తున్నాడు. చెరుకు పంటతో పోలిస్తే మునగ అమ్మకాలలో నగదు తక్షణమే లభించడం అతనికి పెద్ద ఊరట కలిగిస్తోంది. కరువు నేలపై కూడా సరికొత్త ఆలోచనలతో విజయం సాధించవచ్చని ఉద్ధవ్ గోవర్ధన్ నిరూపించాడు. అతని కథ నేటి రైతులకు మార్గదర్శకంగా నిలుస్తోంది.