Home » Devotional » Mahabharata Life Not Fair On Anybody Sri Krishna Conversation With Karna
Devotional

Mahabharata : త‌న క‌ష్టాలు చెప్పుకున్న క‌ర్ణుడు.. వ్య‌క్తిత్యం ముఖ్యం.. ఏ ప‌రిస్థితుల్లో అయినా ధ‌ర్మం వైపే నిల‌బ‌డాల‌న్న శ్రీ‌కృష్ణుడు

Authored By
mallesh
The Telugu News | Published on: April 19, 2022, 7:40 am
Advertisement

Mahabharata : క‌ర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి. కర్మ సిద్ధాంతాన్నిహిందువులు బ‌లంగా న‌మ్ముతారు. ఎవ‌రు చేసిన పాపాల‌కు వారు అనుభ‌వించ‌క త‌ప్ప‌దు అంటారు పెద్ద‌లు. పురాణాలు కూడా ఇదే చెప్తున్నాయి. హిందూ మతం, దాని నుండి ఉద్భవించిన బౌద్ధ మతం, సిక్కు మతం, జైన ఈ నాలుగు మతాలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాయి. ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి.కర్మ అంటే మానసికముగా గాని, శారీరకముగాగాని చేసింది. ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణము ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే అంటుంటారు. చెడు కర్మకి ఫలితం పాపం, పాపానికి దుఃఖము, మంచి కర్మకి ఫలితము పుణ్యము.

Advertisement

పుణ్యానికి సుఖము అనుభవించాలి. వాటిని అనుభ వించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంద‌ని హిందూ సనాతన ధర్మం చెప్పే కర్మ సిద్దాంతం. ఈ సిద్దంతమే హిందూ మతానికి పునాది. అయితే ఇదే విష‌యంపై మ‌హాభార‌తంలో శ్రీ‌కృష్ణుడు, క‌ర్ణుడి మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం….ఓ సంద‌ర్భంలో క‌ర్ణుడు శ్రీ‌కృష్ణుడితో జ‌న్మత త‌న క‌ష్టాల గురించి చెప్పుకుంటాడు ఇలా.. నేను పుట్టీపుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది. అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్పు కాదు కాదా.. ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పేటందుకు నిరాకరించారు. ఎందుకంటే నేను క్షత్రియుడి కాను అన్న కారణంతో.. పరశురాముడు నాకు విద్యనైతే నేర్పాడు కానీ.. నేను క్షత్రియుడిగా గుర్తింపబడేవరకూ ఆ విద్యనంతా మరిచిపోయేలా నాకు శాపం పెట్టాడు. పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకున్నా నన్ను నిందించారు.

mahabharata life not fair on anybody sri krishna conversation with karna

Advertisement

ద్రౌపదీ స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది. కుంతీమాత వచ్చి నేను తన పుత్రుడిని అని నాకు నిజం చెప్పటం వెనకనున్న కారణం కేవలం ఆవిడ తన వేరే పుత్రులను కాపాడుకోవటం కోసమే. నేనంటూ ఏదన్నా పొందాను అంటే అది దుర్యోధనుని దయాధర్మం వల్లనే. అలాంటప్పుడు నేను దుర్యోధనుని పక్షాన ఉండటం తప్పెలా అవుతుంది అని అన్నాడు కర్ణుడు.అప్పుడు శ్రీకృష్ణుడు కర్ణుడితో ఇలా అన్నాడు.. నేను పుట్టడ‌మే జైలులో పుట్టాను. నేను పుట్ట‌డం కంటే ముందే నా చావు నాకోసం కాచుకుని కూర్చుంది. నేను పుట్టిన రాత్రే నా కన్న తల్లితండ్రి నుండి వేరుచేయబడ్డాను. చిన్నతనంలో నువ్వు కత్తులు , రధాలు, బాణాలు, గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు. నేను గోశాలలో పేడ వాసనల మధ్య పెరిగాను. నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి. అప్పటికి నాకు నడిచే వయసు కూడా రాలేదు. కానీ ఎన్నో దాడులు ఎదుర్కున్నాను.

నాచుట్టూ ఉన్న వారు వారి సమస్యలకు నేనే కారణం అని నన్ను నిందించేవారు. నాకు సైన్యమూ లేదు, విద్య కూడా లేదు. మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచీ అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు నోచుకోలేదు.సాందీపుని రుషి వద్ద నా పదహారో ఏటా నా చదువు ప్రారంభం అయ్యింది. నువ్వు నీకు ఇష్టమైన అమ్మాయిని వివాహం చేసుకోగలిగావు. నేను నాకిష్టమైన అమ్మాయిని చేసుకోలేకపోయాను..పైగా నన్ను వివాహం చేసుకున్నవారు..వారు నన్ను కోరుకుని కొందరూ, నేను రాక్షసుల నుండి కాపాడబడినవారు కొందరూనూ.. జరాసంధుని బారి నుంచీ కాపాడుకోవటానికి నా గోకులాన్నంతా నేను యమున న‌ది ఒడ్డు నుంబి దూరంగా తీసుకెళ్లాల్సి వచ్చింది. అప్పుడు పిరికివాడుగా పారిపోయానన్న చెడ్డపేరు నాకొచ్చింది.సరే ఇంతకీ దుర్యోధనుడు ఈ యుద్ధం గెలిచాడే అనుకో నీకు మంచిపేరు వస్తుంది.

Advertisement

అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు. పైగా ఈ యుద్ధం మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకూ నేనే కారణం అన్న నింద వేస్తారు. ఒకటి గుర్తుంచుకో కర్ణా.. జీవితంలో సమస్యలు, సవాళ్ళు అందరికీ ఉంటాయి. జీవితం ఏ ఒక్కరికీ పూలబాట కాదు. అన్నివేళలా అంతా సవ్యంగానే ఉండదు. దుర్యోధనుడు అవనీ యుధిష్టరుడు అవనీ అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసినవారే. ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనసుకి నీ బుద్ధికి తెలుసు. మనకు ఎంత అన్యాయం జరిగినా… మనకు ఎన్ని పరాభవాలు జరిగినా… మనకు రావల్సినది మనకు అందకపోయినా… మనం ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వమ‌ని, ఇది మ‌నిషి జీవితంలో ముఖ్య‌మైంద‌ని చెప్పాడు.జీవితంలో ఆటుపోట్లు భరించామనో, మనకు చెడు అనుభవాలు ఎదురయ్యాయనో… అనే కారణాలు మనకు అధర్మమార్గంలో ప్రయాణించేందుకు అనుమతిగా అనుకోకూడదు. మనం బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోకి నడిపించకూడదు. ఏ పరిస్థితుల్లో అయినా ధర్మాన్ని వదులుకోకూడని కర్ణుడికి క్రృష్ణుడు బోధించాడు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి