Allu Arjun : విశాఖలో అల్లు అర్జున్ AAA Cinemas.. ఏపీలోనే ఫస్ట్ టైమ్ ఇలాంటి థియేటర్!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 9 August 2026, 4:18 pm
  •  Allu Arjun , విశాఖపట్నంలో అల్లు అర్జున్ AAA Cinemas గ్రాండ్‌గా ప్రారంభమైంది. 8 స్క్రీన్లు, ఏపీలోనే అతిపెద్ద 70 అడుగుల LED స్క్రీన్, 1,556 సీట్ల సామర్థ్యం, VIP లాంజ్ వంటి ప్రత్యేకతలు తెలుసుకోండి.

Allu Arjun  : సాగరనగరం విశాఖపట్నంలో సినిమా ప్రేక్షకులకు మరో భారీ ఎంటర్‌టైన్‌మెంట్ డెస్టినేషన్ అందుబాటులోకి వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భాగస్వామ్యంతో కొనసాగుతున్న ఆసియన్ అల్లు అర్జున్ సినిమాస్ AAA Cinemas మల్టీప్లెక్స్ తాజాగా విశాఖలో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఇప్పటివరకు హైదరాబాద్‌కే పరిమితమైన AAA Cinemas బ్రాండ్ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టింది. అల్లు అర్జున్ స్వయంగా ఈ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు. విశాఖపట్నంలోని కైలాసపురంలో నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్‌లో AAA Cinemas మల్టీప్లెక్స్‌ను ఏర్పాటు చేశారు. గత ఏడాది నవంబర్‌లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగగా, కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే నిర్మాణ పనులు పూర్తి చేసి మల్టీప్లెక్స్‌ను అందుబాటులోకి తీసుకురావడం విశేషంగా మారింది. మొత్తం ఎనిమిది స్క్రీన్లతో ఈ మల్టీప్లెక్స్ రూపుదిద్దుకుంది. అంతేకాదు, దేశంలోనే మొట్టమొదటి LED ప్రొజెక్షన్ క్యూలుక్సన్ స్క్రీన్‌ను ఇక్కడ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

Allu Arjun : విశాఖలో అల్లు అర్జున్ AAA Cinemas.. ఏపీలోనే ఫస్ట్ టైమ్ ఇలాంటి థియేటర్!

Allu Arjun : విశాఖలో అల్లు అర్జున్ AAA Cinemas.. ఏపీలోనే ఫస్ట్ టైమ్ ఇలాంటి థియేటర్!

Allu Arjun  ఏపీలోనే అతిపెద్ద LED స్క్రీన్.. 1,556 మందికి సీటింగ్

విశాఖ AAA Cinemasలో ఏర్పాటు చేసిన భారీ LED సినిమా స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఏపీలోనే అతిపెద్దదిగా చెబుతున్న ఈ స్క్రీన్ 70 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో ఉంది. ఒకేసారి సుమారు 1,556 మంది ప్రేక్షకులు సినిమాను వీక్షించేలా సీటింగ్ సామర్థ్యాన్ని కల్పించారు. భారీ స్క్రీన్‌తో పాటు థియేటర్‌లో ప్రేక్షకులకు ప్రీమియం సినిమా అనుభూతిని అందించేలా పలు ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరుతో ప్రత్యేకంగా ‘ఐకాన్ స్టార్ లాంజ్‌’ను ఆకర్షణీయంగా రూపొందించారు. రీక్లైనర్ టికెట్ తీసుకునే VIP ప్రేక్షకుల కోసం ఈ లాంజ్‌ నుంచి ప్రత్యేక ప్రవేశ సదుపాయాన్ని కూడా కల్పించారు. దీంతో సాధారణ సినిమా అనుభూతికి భిన్నంగా ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌ను అందించే ప్రయత్నం చేశారు. ఇదే కాంప్లెక్స్‌లో ప్రైవేట్ ప్రివ్యూ స్క్రీనింగ్స్, సినిమా ఫంక్షన్లు, ప్రీరిలీజ్ ఈవెంట్లు నిర్వహించుకునేందుకు ప్రత్యేకంగా ‘82 లాంజ్‌’ను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో డాల్బీ సౌండ్ సిస్టమ్‌తో కూడిన ప్రత్యేక స్క్రీన్ అందుబాటులో ఉంది. దీంతో సినిమా ప్రదర్శనలతో పాటు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలకు కూడా ఈ వేదిక ఉపయోగపడనుంది.విశాఖపట్నంలో AAA Cinemas ప్రారంభమైన నేపథ్యంలో భవిష్యత్తులో ఈ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రధాన నగరాలకు కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయనే చర్చ మొదలైంది. ముఖ్యంగా విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో కూడా AAA మల్టీప్లెక్స్‌లు ఏర్పాటయ్యే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.

Allu Arjun  మహేష్ బాబు తర్వాత అల్లు అర్జున్.. ఆసియన్ థియేటర్స్‌తో కొత్త భాగస్వామ్యం

ఆసియన్ థియేటర్స్‌తో ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు భాగస్వామ్యం ఉన్న విషయం తెలిసిందే. మహేష్ బాబు, ఆసియన్ థియేటర్స్ కలిసి ‘AMB’ పేరుతో మల్టీప్లెక్స్ థియేటర్ చైన్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఇదే తరహాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆసియన్ థియేటర్స్ యాజమాన్యంతో చేతులు కలిపారు. ఇందులో భాగంగానే AAA Cinemas బ్రాండ్ రూపుదిద్దుకుంది. విశాఖలో AAA Cinemas ప్రారంభోత్సవం సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడారు. తన తాజా సినిమా ‘రాకా’కు సంబంధించిన పలు అప్‌డేట్స్‌ను కూడా క్లుప్తంగా వెల్లడించారు. ప్రస్తుతం ‘రాకా’ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోందని ఆయన తెలిపారు. తాను షూటింగ్ సెట్‌ నుంచే విశాఖకు వచ్చానని, ఈ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించాలనే ఉద్దేశంతో ఒక్కరోజు బ్రేక్ తీసుకుని నగరానికి వచ్చినట్లు చెప్పారు. మళ్లీ మరుసటి రోజు నుంచే ‘రాకా’ షూటింగ్‌లో పాల్గొంటానని అల్లు అర్జున్ వెల్లడించారు.

విశాఖపట్నంలో ఇనార్బిట్ వంటి భారీ మాల్ వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదని అల్లు అర్జున్ అన్నారు. ‘గంగోత్రి’ సినిమా షూటింగ్ సమయంలో తాను వైజాగ్‌కు వచ్చానని, అప్పట్లో నగరంలోని రోడ్లు ఖాళీగా కనిపించేవని గుర్తుచేశారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, నగరంలో అడుగు పెట్టడానికి కూడా చోటు లేనంతగా అభివృద్ధి జరిగిందని నవ్వుతూ వ్యాఖ్యానించారు. మాల్ అంటే కేవలం ఒక కమర్షియల్ కాంప్లెక్స్ మాత్రమే కాదని, అది ఒక నగర సంస్కృతికి కూడా అద్దం పడుతుందని అల్లు అర్జున్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఇలాంటి భారీ మాల్ ఏర్పాటు కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.

ఇక విశాఖ కైలాసపురంలో ఇనార్బిట్ మాల్‌కు 2023లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. దేశీయ పారిశ్రామిక దిగ్గజం కే రహేజా గ్రూప్ ఈ భారీ మాల్‌ను నిర్మించింది. మొత్తం 17 ఎకరాల విస్తీర్ణంలో సుమారు ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంతో ఈ బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ రూపుదిద్దుకుంది. ఈ ప్రాజెక్టు కోసం రహేజా గ్రూప్ సుమారు రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఇప్పటికే ఇనార్బిట్ మాల్స్ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, మలాద్, వసై, నవీ ముంబై, వడోదర వంటి నగరాల్లో ఇనార్బిట్ మాల్స్ నిర్మితమయ్యాయి. తాజాగా విశాఖపట్నం కూడా ఈ జాబితాలో చేరింది. మొత్తంగా చూస్తే.. AAA Cinemas రాకతో విశాఖ నగరంలోని సినిమా ప్రేక్షకులకు మరో ప్రీమియం మల్టీప్లెక్స్ అనుభవం అందుబాటులోకి వచ్చినట్లైంది. భారీ LED స్క్రీన్, ఎనిమిది స్క్రీన్లు, ప్రత్యేక లాంజ్‌లు, VIP సదుపాయాలు, డాల్బీ సౌండ్ వంటి ఫెసిలిటీలతో ఈ మల్టీప్లెక్స్ విశాఖ సినీ అభిమానులను ఆకట్టుకునేలా సిద్ధమైంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp