Hyderabad : హైదరాబాద్లో దోమలు పెరగడానికి కారణం ఇదే.. ఫాగింగ్లో భారీ స్కాం..!
ప్రధానాంశాలు:
Hyderabad : హైదరాబాద్లో దోమలు పెరగడానికి కారణం ఇదే.. ఫాగింగ్లో భారీ స్కాం..!
Hyderabad : హైదరాబాద్ నగరంలో దోమల సమస్య రోజురోజుకు తీవ్రమవుతుండటానికి ఆశ్చర్యకరమైన కారణం బయటపడింది. నగర ప్రజల ఆరోగ్య రక్షణ కోసం చేపట్టాల్సిన ఫాగింగ్ కార్యక్రమంలోనే భారీ అవినీతి జరిగినట్లు వెల్లడైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో దోమల నిర్మూలన కోసం కేటాయించిన డీజిల్ను వినియోగించకుండా అక్రమంగా అమ్ముకున్న ఘటన సంచలనం సృష్టిస్తోంది. ప్రతి నెల ఫాగింగ్ వాహనాలకు సరఫరా చేయాల్సిన డీజిల్ను పూర్తిగా ఉపయోగించకుండా దానిలో పెద్ద భాగాన్ని బయట విక్రయించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంలో సంబంధిత సిబ్బందికి నెలకు రూ.5 వేల చొప్పున ఇచ్చి మిగిలిన మొత్తాన్ని సూపర్వైజర్, ఏఈ, ఎస్ఈ స్థాయి అధికారులు పరస్పరం పంచుకున్నట్లు సమాచారం. ఫాగింగ్ పనులు కాగితాలపైనే జరిగి నేలమీద మాత్రం సరిగా అమలు కాలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ అవినీతి బాగోతం అంతర్గతంగా జరిగిన డబ్బుల పంపకాల్లో తేడాలు రావడంతో బయటపడినట్లు తెలుస్తోంది. కొంతమంది సిబ్బంది మధ్య తలెత్తిన విభేదాలు పైస్థాయి అధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణ ఆదేశించారు. ప్రాథమిక దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలడంతో సంబంధిత సూపర్వైజర్ను తొలగించినట్లు సమాచారం. ఈ ఘటన అనంతరం సిబ్బంది డీజిల్ను అక్రమంగా విక్రయించే అవకాశం లేకుండా అధికారులు కొత్త చర్యలు చేపట్టారు. ఫాగింగ్ కోసం వినియోగించే డీజిల్లో మెలాథిన్ కెమికల్ కలిపి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా దుర్వినియోగాన్ని అరికట్టాలని యాజమాన్యం భావిస్తోంది. దోమల నివారణలో నిర్లక్ష్యం, అవినీతి కారణంగా ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.