Srinivas Goud : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై విద్యార్థుల ఆగ్రహం.. ప్రభుత్వానికి శ్రీనివాస్ గౌడ్ అల్టిమేటం
ప్రధానాంశాలు:
Srinivas Goud : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై విద్యార్థుల ఆగ్రహం.. ప్రభుత్వానికి శ్రీనివాస్ గౌడ్ అల్టిమేటం
Srinivas Goud : హైదరాబాద్: తెలంగాణలో పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ గన్పార్క్ వద్ద విద్యార్థి సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులతో కలిసి మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ, బీసీ జేఏసీ నాయకులు గుజ్జ కృష్ణ, సురేష్, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహ నాయక్తో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా పెండింగ్లో ఉన్న మొత్తాన్ని విడుదల చేసి విద్యార్థులపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించాలని కోరారు.విద్య అనేది ప్రతి విద్యార్థి హక్కు అని పేర్కొన్న ఆయన, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్య మధ్యలోనే ఆగిపోకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్తగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కూడా గతంలో అమలైన విధంగానే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాలని సూచించారు.

Srinivas Goud : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై విద్యార్థుల ఆగ్రహం.. ప్రభుత్వానికి శ్రీనివాస్ గౌడ్ అల్టిమేటం
Srinivas Goud విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దు
ప్రభుత్వం విద్యార్థులపై రికవరీ యాక్ట్ అమలు చేస్తామని చెప్పడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఇలాంటి చర్యలు విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఫీజులు చెల్లించలేక అనేక మంది విద్యార్థులు కళాశాలల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొందరు పరీక్షలకు కూడా హాజరు కావడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ సమస్యను అత్యవసరంగా పరిగణించి వెంటనే పరిష్కరించాలని కోరారు.
స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం
ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే విద్యార్థి సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం అన్ని ప్రజాస్వామ్య మార్గాల్లో పోరాటం కొనసాగిస్తామని, ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగిస్తే కార్యాచరణ ప్రకటించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు కూడా పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేసి, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు







