AIMIM : తెలంగాణను వదిలేసి ఆ రాష్ట్రం మీద పడ్డ ఎంఐఎం.. ఏకంగా డిప్యూటీ సీఎం పదవికే ఎసరు?

Authored By Emmaneni | The Telugu News | Updated on : 28 July 2021, 11:52 am

కొడితే .. ఏనుగు కుంభస్థలాన్నే..

ఎంఐఎం పార్టీ అలాగే ఆలోచిస్తుందట. వచ్చే ఏడాది మొదట్లోనే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో గెలుపు ఇటు సమాజ్ వాది పార్టీ కి, అటు బహుజన్ సమాజ్ వాదిపార్టీకి చాలా కీలకంగా మారింది. ఇందుకనే చిన్నా చితకా పార్టీలతో పోటీపడితే ఓట్లు చీలుతాయన్న టెన్షన్ ఇరు పార్టీల్లో వ్యక్తమవుతోంది. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు ఇరు పార్టీలు చిన్న పార్టీల నేతలతో చర్చలు మొదలెట్టాయి. అయితే ఇదే చిన్న పార్టీలకు అడ్వాంటేజ్ గా మారింది. కనీసం ఉట్టికి ఎగరలేని పార్టీలు సైతం స్వర్గానికి ఎగురుతామని అంటున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఎంఐఎం నేతలతో చర్చలకు దిగిన ఎస్పీ నేతలు అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..

AIMIM ఏకంగా డిప్యూటీ పదవే..

ఎస్పీ నేతలతో పొత్తు చర్చలు జరిపిన ఎంఐఎం నేతలు ఏకంగా ఉపముఖ్యమంత్రి పదవినే బేరానికి పెట్టారు. రాబోయే ఎన్నికల్లో ఎస్పీ గనుక అధికారంలోకి వస్తే తమ పార్టీకి డిప్యుటీ సీఎం పదవిని ఇవ్వాల్సిందే అని గట్టిగా చెప్పటం విశేషం. ఎంఐఎం డిమాండ్ చేయటాన్ని పక్కనపెట్టేస్తే అసలు ఆ పార్టీకి యూపీలో అంత సీనుందా అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. దశాబ్దాల పాటు హైదరాబాద్ లోని పాతబస్తీకి మాత్రమే పరిమితమైన పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలని ఎంపి, జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లోని ఎన్నికల్లో పాల్గొన్నారు. మహారాష్ట్ర, బీహార్ లో కాస్త సక్సెస్ అయ్యారంతే. కాకపోతే ఇతర పార్టీలకు ముస్లిం ఓట్లు వెళ్ళకుండా చీల్చుకున్నారు. దీంతో త్వరలో జరిగే యూపీ ఎన్నికల్లో 100 సీట్లలో పోటీ చేయాలని అసదుద్దీన్ ఇప్పటికే నిర్ణయించారు. ఇందులో భాగంగానే గట్టి అభ్యర్ధుల కోసం రెండుసార్లు టూర్ కూడా చేశారు. తాము పోటీ చేయాలని అనుకున్న నియోజకవర్గాలన్నీ ముస్లిం ప్రాబల్యమున్నవే కావటం గమనార్హం.

ముస్లిం ఓట్లే..

దశాబ్దాలుగా ఎస్పీ కూడా యాదవ, ముస్లిం ఓట్లపైనే ఆధారపడుతోంది. అందుకనే ఇపుడు ఎస్పీతో పొత్తులు పెట్టుకుని లాభపడాలని ఎంఐఎం భావిస్తోందన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది. ఈ విషయాన్ని గ్రహించిన ఎస్పీ నేతలు కూడా పొత్తులకు ఓకే చెప్పారు. అయితే అనూహ్యంగా తమకు డిప్యూటి సీఎం పదవి కావాలని డిమాండ్ చేసేటప్పటికి ఎస్పీ నేతలు ఆశ్చర్యపోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో చెప్పినట్లు సమాచారం. పొత్తుల విషయాన్ని డిసైడ్ చేయటానికి తొందరలోనే అసద్ యూపిలో పర్యటించనున్నారు. పనిలో పనిగా అఖిలేష్ తో కూడా భేటీ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అప్పుడు పొత్తులపై క్లారిటి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే డిప్యూటీ సీఎం .. ఇవ్వడంపై సమాజ్ వాదీ పార్టీలోనే అంతర్గతంగా తెగ చర్చలు సాగుతున్నాయి. 

Emmaneni

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp