Andhra Pradesh Weather Updates | తీవ్ర వాయుగుండం ప్రభావం: ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు..శ్రీకాకుళంలో 10 మండలాలకు సెలవు

Authored By Sam C | The Telugu News | Published on: October 3, 2025, 1:30 pm

Andhra Pradesh Weather Updates | ఒడిశా రాష్ట్రంలోని గోపాల్‌పూర్ వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలహీనమవుతోందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే, దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వర్షపాతం తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు.

#image_title

వరద ముప్పు, జాగ్రత్తల చర్యలు

వర్షాల ప్రభావంతో వంశధార, నాగావళి, బహుదా నదుల్లో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. వర్షాల కారణంగా శ్రీకాకుళం జిల్లాలో వరద ముప్పు ఏర్పడింది. కొన్నిచోట్ల ఫ్లాష్ ఫ్లడ్‌లకు అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేశారు. తీరప్రాంతాల్లో గంటకు 50–70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపిన అధికారులు, మత్స్యకారులు అక్టోబర్ 4 వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు.

వంశధార నదిలో వరద ఉధృతి పెరగడంతో గొట్టా బ్యారేజీ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.నాగావళి నది ప్రవాహం భారీగా పెరుగుతోంది. మహేంద్రతనయ నది ఉధృతితో శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం RTC కాంప్లెక్స్, మహేంద్రనగర్ వీధుల్లోకి వరదనీరు చేరింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో తీవ్ర వర్షాలు, వరద ముప్పు నేపథ్యంలో 10 మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. సెలవు ప్రకటించిన మండలాలు చూస్తే.. నరసన్నపేట,జలుమూరు, ఆమదాలవలస, హిరమండలం, శ్రీకాకుళం, గార, పోలాకి, ఎల్‌.ఎన్‌.పేట, కొత్తూరు, సరుబుజ్జిలి మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు

Sam C

No bio available for this author.

Tags :
    Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
    WhatsApp