Auto Drivers | ఆటో డ్రైవర్స్కి రూ.15 వేల ఆర్ధిక సాయం..దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడు, డబ్బులొచ్చేది ఎప్పుడు..!
Auto Drivers | రాష్ట్రంలోని అర్హులైన ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్థిక సాయం అందిస్తామని ఇటీవల చంద్రబాబు నాయుడు ప్రకటించడం మనం చూశాం. ఆటో రిక్షా, మోటార్ క్యాబ్ యాజమానులకు, డ్రైవర్గా స్వయం ఉపాధి పొందుతున్న వారందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు (AP Govt Auto Drivers) రవాణాశాఖ విడుదల చేసిన జీవోలో పేర్కొంది.

#image_title
ఇవి తెలుసుకోండి..
గత వైసీపీ ప్రభుత్వంలో వాహన మిత్ర పేరుతో రూ.10వేలు ఆర్థిక సహాయం చేయగా.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆటో మిత్ర పేరుతో రూ.15వేలు ఆర్థిక సహాయం అందించేందుకు నిర్ణయించింది. ఈ పథకంలో భాగంగా ఈనెల 13వ తేదీ నాటికి ఉన్న పాత లబ్ధిదారుల జాబితాను పరిగణించడంతో పాటు కొత్త దరఖాస్తులకు ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈనెల 24వ తేదీనాటికి తుది జాబితాను సిద్ధం చేస్తారు. తుది జాబితా ప్రకారం.. అక్టోబర్ 1వ తేదీన లబ్ధిదారుల ఖాతాల్లో రూ.15వేల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం జమ చేయనుంది.
పథకానికి అర్హతలు ఇవే..
– ఏపీలో జారీ చేసిన ఆటో రిక్షా, లైట్ మోటార్ వాహనాన్ని నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్సును దరఖాస్తుదారులు కలిగి ఉండాలి.
– ఒకవేళ ఆటో రిక్షా విషయంలో ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోయినా 2025 -26 సంవత్సరానికి అనుమతిస్తారు. అయితే, ఒక నెలలోపు ఆ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.
-వాహనం ఏపీలో రిజిస్టర్ అయ్యి ఉండాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి.
– దరఖాస్తు దారులు దారిద్ర్య రేఖకు దిగువన (బీపీఎల్) ఉండాలి. రేషన్ కార్డు కలిగి ఉండాలి.
– దరఖాస్తుదారు లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి/పెన్షనర్ గా ఉంటే అనర్హులు. పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంటుంది.
-ఇంటి విద్యుత్తు వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. దరఖాస్తు తేదీకి ముందు 12నెలల సగటు లెక్కిస్తారు.