EPFO | పీఎఫ్ పాక్షిక ఉపసంహరణపై ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం.. కోట్లాది మంది ఉద్యోగులకు శుభవార్త
EPFO | దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులకు పింఛను నిధుల్లో సౌలభ్యం కలిగించేలా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పీఎఫ్ పాక్షిక ఉపసంహరణ (Partial PF Withdrawal)కు సంబంధించిన నిబంధనలను సరళతరం చేయాలని నిర్ణయించడంతో, అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులకు తక్షణ సహాయం అందే అవకాశం ఏర్పడనుంది.
#image_title
కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు పీఎఫ్ ఉపసంహరణ కోసం ఉద్యోగులు కఠినమైన నిబంధనల మధ్య నడవాల్సి వచ్చేది. ముఖ్యంగా, ఉద్యోగి వాటాలో మాత్రమే డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశముండేది. కానీ, తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఉద్యోగి, యాజమాని వాటా కలిపి ఉన్న మొత్తాన్ని పూర్తిగా విత్డ్రా చేయటానికి అనుమతి ఇవ్వనున్నారు.
ముఖ్యాంశాలు:
పీఎఫ్ పాక్షిక ఉపసంహరణకు సంబంధించిన 13 నిబంధనలను ఒకే నియమంగా క్రమబద్ధీకరించారు.
పాక్షిక ఉపసంహరణ అవసరాలను మూడు విభాగాలుగా వర్గీకరించారు –
అనారోగ్యం, విద్య, వివాహం
గృహ అవసరాలు
ప్రత్యేక పరిస్థితులు
ఇకపై ఏమైనా కారణం చూపకుండానే పీఎఫ్ లోంచి డబ్బును ఉపసంహరించుకునే అవకాశం.
విద్య కోసం పది సార్లు, వివాహం కోసం ఐదు సార్లు విత్డ్రా చేసుకునే వీలుగా మార్పులు. ఇప్పటివరకు మూడు సార్లే అనుమతి.
అన్ని రకాల ఉపసంహరణలకూ కనీస సేవా కాలాన్ని 12 నెలలకు తగ్గించారు.
పీఎఫ్ ఖాతాలో కనీసంగా 25 శాతం బ్యాలెన్స్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది.