Trump | ట్రంప్ కొత్త హెచ్-1బీ నిబంధనలు కలకలం..అమెరికా తిరుగు ప్రయాణానికి భారత టెక్కీలు హడావుడి
Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా హెచ్-1బీ వీసా మార్పులు భారతీయ టెక్ వర్గాల్లో తీవ్ర గందరగోళానికి దారితీశాయి. సెప్టెంబర్ 21 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం, హెచ్-1బీ వీసాపై పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులను తిరిగి అమెరికా పంపించాలంటే సంబంధిత కంపెనీలు $100,000 (సుమారు రూ.83 లక్షలు) రుసుము చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది.
#image_title
పరుగో పరుగు..
ఈ మార్పు నేపథ్యంగా, ప్రస్తుతం సెలవులపై భారత్లో ఉన్న వేలాది మంది టెక్కీలు అమెరికాకు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రముఖ టెక్ కంపెనీలు తమ హెచ్-1బీ ఉద్యోగులకు “తక్షణం అమెరికాకు చేరుకోండి” అనే సూచనలను జారీ చేశాయి. దీంతో ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోని ఎయిర్పోర్టులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
విమాన టికెట్ల ధరలు సాధారణంగా రూ.40,000 – 50,000 ఉండగా, ప్రస్తుతం రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు పెరిగిపోయాయని ట్రావెల్ ఏజెంట్లు వెల్లడిస్తున్నారు. ఈ పరిణామాలతో పలు విమానాల్లో చివరి నిమిషంలో టికెట్లు రద్దు చేసుకున్నవారు కూడా కనిపిస్తున్నారు. కొంతమంది ఉద్యోగులకు వీసా గడువు త్వరలో ముగియబోతుండడంతో, వారు కొత్త నిబంధనల ప్రభావం పడకముందే అమెరికా చేరుకోవాలన్న ఆందోళనలో ఉన్నారు. దీంతో వెంటనే తిరుగు ప్రయాణం చేయాలని కంపెనీలు సూచించడంతో, టెక్కీలు కుటుంబాల్ని వదిలేసి తిరిగి బయలుదేరుతున్నారు.