KCR : ఉద్యమ రచన చేసిన గదిలోనే విచారణ .. కేసీఆర్ భావోద్వేగం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KCR : ఉద్యమ రచన చేసిన గదిలోనే విచారణ .. కేసీఆర్ భావోద్వేగం..!

 Authored By suma | The Telugu News | Updated on :1 February 2026,7:00 pm

ప్రధానాంశాలు:

  •  KCR : ఉద్యమ రచన చేసిన గదిలోనే విచారణ .. కేసీఆర్ భావోద్వేగం..!

KCR : తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో  phone tapping case  తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును KCR ప్రత్యేక దర్యాప్తు బృందం Sit విచారించే ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఆదివారం మధ్యాహ్నం  Hyderabad KCR Nandi Nagar House  హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో సిట్ అధికారులు విచారణ చేపట్టారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రశ్నలు కొనసాగుతుండగా మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్ ద్వారా డాక్యుమెంట్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు…

KCR ఉద్యమ రచన చేసిన గదిలోనే విచారణ కేసీఆర్ భావోద్వేగం

KCR : ఉద్యమ రచన చేసిన గదిలోనే విచారణ .. కేసీఆర్ భావోద్వేగం..!

KCR : నందినగర్‌లో సిట్ విచారణ.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిజానిజాలు వెలికితీయాలనే ఉద్దేశంతో సిట్ పూర్తి సన్నద్ధతతో రంగంలోకి దిగింది. ఆదివారం మధ్యాహ్నం సిట్ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లతో కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా నందినగర్ పరిసర ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును పెంచారు. విచారణ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. సిట్ బృందంలో మాదాపూర్ డీసీపీ రీతిరాజ్‌తో పాటు ఐపీఎస్ అధికారులు విజయ్‌కుమార్, నారాయణరెడ్డి సహా పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్న సమయంలో ఆయన ఇచ్చే సమాధానాలు సమర్పించే వివరాలు ఈ కేసు దిశను మార్చే అవకాశముందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి.

KCR : ఎర్రవల్లి నుంచి నందినగర్‌కు కేసీఆర్.. కేటీఆర్ స్వాగతం

విచారణకు ముందు కేసీఆర్ ఉదయం ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి హైదరాబాద్ నందినగర్ నివాసానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు స్వాగతం పలికారు. విచారణను ఎదుర్కొనేందుకు కేసీఆర్ మానసికంగా, న్యాయపరంగా సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్ తన వెంట ఒక నోట్‌బుక్‌తో పాటు కొన్ని కీలక పత్రాలను కూడా తీసుకొచ్చినట్లు సమాచారం. విచారణ సమయంలో తన వాదనకు అవసరమైన అంశాలను స్పష్టంగా వివరించేందుకు ఆయన ముందస్తుగా సిద్ధమయ్యారని తెలుస్తోంది. అంతేకాకుండా కేసీఆర్ వెంట మాజీ ఎంపీ సంతోశ్ రావు ఉండేందుకు అనుమతి ఇచ్చినట్లు బీఆర్ఎస్ లీగల్ టీమ్ సిట్‌కు తెలియజేసింది.

KCR : ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు.. 600 మందిపై నిఘా?

ఈ కేసులో ప్రధాన ఆరోపణ ఏమిటంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు సహా 600 మందికి పైగా వ్యక్తుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారన్నది. ఈ వ్యవహారంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో SIB అధికారులు కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టి. ప్రభాకర్ రావు ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీశ్ రావు వంటి బీఆర్ఎస్ కీలక నేతలను సిట్ విచారించింది. పలువురు పోలీసు అధికారులను అరెస్టు కూడా చేసింది. ఈ క్రమంలోనే తాజాగా కేసీఆర్ విచారణతో ఈ కేసు మరింత కీలక దశకు చేరిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ విచారణ ఎలాంటి సంచలన విషయాలను వెలుగులోకి తెస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

KCR : మధ్యాహ్న భోజన సమయంలో కేసీఆర్ భావోద్వేగం

మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా తన నివాసంలో అధికారుల ప్రశ్నలను ఎదుర్కొంటున్న సమయంలో కేసీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిపోసా, ఉద్యమ రచన చేసిన గదిలోనే విచారణ ఎదురుకోవాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. రాష్ట్ర సాధన కోసం ఇదే గదిలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. ఇదే గదిలో ఎంతో మందితో చర్చలు జరిపా. ఈ గదిలోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వ్యూహ రచన చేశా. ఇప్పుడు ఇదే గదిలో విచారణ ఎదుర్కోవడం దురదృష్టకరం కేసీఆర్‌ తెలిపారు.

suma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది