Kuppam Politics : కుప్పం రాజకీయం.! చంద్రబాబు రెచ్చగొట్టి సాధించేదేంటి.?
Kuppam Politics : కుప్పం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చాలా పెద్ద రచ్చ జరిగింది. సొంత నియోజకవర్గంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి పర్యటన కారణంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్ఎస్జీ అదనపు భద్రత కూడా కల్పించాల్సి వచ్చింది చంద్రబాబునాయుడికి. ఎందుకిదంతా జరుగుతోంది.? రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ లేని దురదృష్టకర పరిస్థితులు కేవలం కుప్పంలోనే ఎందుకు జరుగుతున్నాయి.? కాస్త లోతుగా ఆలోచిస్తే, చంద్రబాబు కుప్పంలో ఓడిపోతారని వైసీపీ బలంగా నమ్ముతుండడం వల్లే ఈ పరిస్థితులు. రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఏమీ బలంగా లేదు.
అయినాగానీ, కుప్పం విషయంలో చంద్రబాబు అత్యుత్సాహం చూపుతున్నారు. అక్కడే ఆయన పట్ల వ్యతిరేకత మరింత పెరుగుతోంది ఇటీవలి కాలంలో. దాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి వాస్తవం. కుప్పం నియోజకవర్గంలోనే ‘జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకోవాలి..’ అని టీడీపీ కార్యకర్తలు కోరుతున్నారు. ఇదే కుప్పం నియోజకవర్గంలోనే ‘జై ఎన్టీయార్’ అనే యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానుల నినాదాలూ చంద్రబాబుకి తలనొప్పి తెచ్చి పెడుతున్నాయి. అయితే, ఇవన్నీ చంద్రబాబు స్క్రిప్టులోనే భాగమా.? అన్న అనుమానాలు కలగడం సహజమే. సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎన్నెన్నో వ్యూహాలు రచించారు, రచిస్తూనే వున్నారు.

Kuppam Politics, Chandrababu Mark
ఆ రాజకీయ వ్యూహాల దెబ్బకి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు రాజకీయ జీవితం అంతమైపోయింది.. ఆయనా భౌతికంగా అంతమైపోయారు. అట్లుంటది చంద్రబాబు రాజకీయంతోని.! సో, చంద్రబాబు కుప్పంలో ఏమైనా చేయగలరు. టీడీపీ కార్యకర్తలకు వైసీపీ రంగులేసి, టీడీపీ మీదకు ఉసిగొల్పగలరు. అదే బహుశా కుప్పంలో జరిగి వుండాలి. ఈ రాజకీయాన్ని టీడీపీ శ్రేణులే జీర్ణించుకోలేకపోతున్నాయి. అయినా, చంద్రబాబు రాజకీయం అంతే. ఆయన రాజకీయ వ్యూహాలూ ఇలాగే వుంటాయి. ఎందుకిదంతా.? కేవలం సింపతీ పొందేందుకేనా.? అంతేనేమో, అలాగే అనుకోవాలేమో.