Gajwel | ఇదెక్కడి విచిత్రం.. 25 ఇళ్లు ఉన్న కాలనీకి ఆరు పేర్లా?
Gajwel | సాధారణంగా ఏ కాలనీకైనా ఒకే పేరు ఉంటుండడం మనం చూస్తాం. కానీ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మాత్రం ఒకే కాలనీలో ఆరు పేర్లు కనిపించడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మొత్తం 25 ఇళ్లు మాత్రమే ఉన్న ఈ చిన్న కాలనీలో ఇటీవల ఒక్కసారిగా కులాల పేర్లతో బోర్డులు దర్శనమివ్వడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
#image_title
ఇన్ని బోర్డులా?
వివరాల్లోకి వెళ్తే.. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సమీపంలో ముట్రాజ్పల్లి రోడ్డు పక్కన ఇటీవలే వినాయకనగర్గా ఓ కొత్త కాలనీ ఏర్పడింది. అప్పటివరకు కుల భేదాలు లేకుండా అందరూ దీనిని వినాయకనగర్గానే పిలిచేవారు కాని ఇప్పుడు ఒక్కసారిగా ఐదు కొత్త బోర్డులు వెలిశాయి. వాటిపై వరుసగా రెడ్డి ఎన్క్లేవ్, ఆర్యవైశ్య ఎన్క్లేవ్, ముదిరాజ్ ఎన్క్లేవ్, విశ్వకర్మ ఎన్క్లేవ్, యాదవ్ ఎన్క్లేవ్ అంటూ పేర్లు రాసి ఉన్నాయి. దీంతో ముందుగా ఉన్న వినాయకనగర్ బోర్డు సహా మొత్తం ఆరు బోర్డులు ఒకే ప్రదేశంలో దర్శనమిస్తున్నాయి.
ఒక్క కాలనీలో ఆరు పేర్లు కనిపించడమే కాదు, అవి కులాల పేర్లతో ఉండటం ఇదొక పాత అవాంతరం మళ్లీ తలెత్తినట్టు కనిపిస్తోంది. తెలంగాణ సమాజం సాధించిన ప్రగతికి ఇది ఒక పదిలమైన ముప్పుగా అభివర్ణించబడుతోంది. సామాజిక ఐక్యతకు పట్టం కట్టే తెలంగాణలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకూడదని, అందరూ కలిసికట్టుగా ఉండేందుకు ప్రజలంతా ఐక్యంగా, జాగ్రత్తగా ఉండాలని పిలుపునిస్తున్నారు.